మోడీ నిద్రపోరు, నిద్రపోనివ్వరు.. అందుకే: వెంకయ్య
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నిద్రపోరు.. ఇతరులను నిద్రపోనివ్వరని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. దాని ఫలితమే.. ఈ రోజు హైదరాబాద్లో నాలుగు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలని, అందుకే ముందుగా మాట్లాడుతున్నానని చమత్కరించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) రిటైర్డ్ సైంటిస్టులు, నూజివీడు సీడ్స్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఎమ్మెస్ స్వామినాథన్ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలతో నవ్వులు పూశాయి. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.

వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలు సృష్టించి రైతుల్లో అవగాహన పెంచి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. 2013 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును డాక్టర్ ఎస్ఎల్ గోస్వామికి అందజేశారు. ఎంటర్టైన్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎంపవర్మెంట్ కోసం పట్టణబాట పడుతున్న యువత తిరిగి పల్లెదారి పట్టాలంటే వ్యవసాయంతోపాటు పాడి, మత్స్య సంపద అభివృద్ధి చెందాలన్నారు. అవార్డు విజేత సుందర్ లాల్ గోస్వామి దేశానికి మరింత సేవ చేయాలని వెంకయ్య ఆకాంక్షించారు.
సవాలుగా తీసుకొని పని చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు. జన్ ధన్ యోజనను అందుకు ఉదహరించారు. దేశ ప్రజలందరితో బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు అయిదేళ్లు పడుతుందని మంత్రులు చెప్పగా.. మోడీ ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారన్నారు. ఇప్పటి వరకు కేవలం ఏడు వారాల్లోనే 6.99 కోట్ల బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరిచారన్నారు.
కాగా, జనతా పరివార్ కలయిక ప్రయత్నాలు గతంలో చాలాసార్లు జరిగాయని, కానీ ఎప్పుడూ విజయవంతం కాలేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ, జనతా దళ్(యూ), జనతాదళ్(ఎస్), లోక్దళ్ తదితర పార్టీల కూటమిపై విలేకరులు ప్రశ్నించగా ఈ పార్టీలన్నీ కలిసినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరంలేదన్నారు.
ప్రపంచంలోని పేరొందిన స్మార్ట్ సిటీల ప్రణాళికలపై అధ్యయనం చేసేందుకు వెంకయ్య నాయుడు మూడు రోజుల పాటు సోమవారం 18న స్పెయిన్ వెళ్తున్నారు. బార్సెలోనాలో జరిగే స్మార్ట్సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications