పోలవరం: తెలంగాణ ఎంపీలతో ఆజాద్, ఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం వాతావరణం వేడెక్కింది. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి, సిపిఎం, న్యూడెమొక్రసీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నాకు దిగారు.
ఆ ధర్నాకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సంఘీభావం ప్రకటించారు. అయితే, కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఉదయం పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ పాల్గొన్నారు.
పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై ఆజాద్ తెలంగాణ ఎంపీలతో చర్చించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలని ఆజాద్ వారికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, తాము దాన్ని రాజ్యసభలో వ్యతిరేకిస్తామని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు అంటున్నారు.
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలుపుతూ గత యుపిఎ ప్రభుత్వం ఆర్డినెన్స్ను రూపొందించింది. ఆ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ బిల్లును లోకసభ ఆమోదించింది. సోమవారం అది రాజ్యసభకు వస్తుందని భావిస్తున్నారు. అయితే, రాజ్యసభలో బిజెపికి తగిన బలం లేకపోవడంతో బిల్లుపై ఉత్కంఠ నెలకొని ఉంది.