బ్లాక్ మనీపై ఫిర్యాదు చేస్తే.. లంచం తీసుకుని.. రివర్స్లో మహిళ పైనే..
:పోలీసుల్లో ఉన్న డొల్లతనం అక్కడే బట్టబయలైంది. విచారిస్తారనుకున్న పోలీసులు.. సదరు డీలర్ వద్ద లంచం తీసుకుని అతన్ని వదిలిపెట్టారు.
న్యూఢిల్లీ : దేశానికి ఎంత మేలు చేయాలనుకుంటే మాత్రం ఏం లాభం.. ఓవైపు నల్లధనానికి చెక్ పెట్టాలని కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే.. దొంగలకు చద్ది కట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పోలీసులు. పైగా.. నల్లకుబేరులపై ఫిర్యాదు చేసినవారిపైనే తమ ప్రతాపం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే మహిళ స్థానికంగా పాన్ షాపు నిర్వహించుకుంటోంది. అదే ప్రాంతంలో ఓ స్క్రాప్ డీలర్ వద్ద కోటి రూపాయల నల్లధనంతో నిండివున్న బ్యాగు ఉన్నట్టుగా షియాకా గుర్తించింది. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం సదరు స్క్రాప్ డీలర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అధికారులు.
పోలీసుల్లో ఉన్న డొల్లతనం అక్కడే బట్టబయలైంది. విచారిస్తారనుకున్న పోలీసులు.. సదరు డీలర్ వద్ద లంచం తీసుకుని అతన్ని వదిలిపెట్టారు. పైగా ఫిర్యాదును ఉపసంహరించుకోవాల్సిందిగా షియాకా పైనే బెదిరింపులకు దిగారు పోలీసులు. పోలీసుల తీరు చూసి కంగు తిన్న షియాకా.. డీసీపీ మిలంద్ దుబ్రేను ఆశ్రయించింది. స్పందించిన డీసీపీ మిలంద్ సదరు లంచావతారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.