ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లిదండ్రులను కాల్చేశాడు
కోల్కతా: ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారని కని పెంచిన తల్లిదండ్రులని కూడా చూడకుండా తుపాకీతో కాల్చి చంపాడో దుర్మార్గుడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఓ పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సచిన్ సోలా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అవినాష్(28)కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే ఈ వివాహం తనకు ఇష్టం లేదంటూ ఆదివారం తల్లిదండ్రులు బాలక్ పాత్ర(50), బిపాలీ పాత్ర(46)లను తుపాకీతో కాల్చి.. తనూ కాల్చుకుని చనిపోయాడు.
తుపాకీ కాల్పుల శబ్ధం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు చేరుకునే లోపే పాత్ర కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యువకుడి కాల్చివేత
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లా కరోడియా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో అన్షుల్ మిశ్రా అనే యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
పాతకక్షల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందని చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు.