పోల్ జిమ్మిక్కే, దళితులను కాంగ్రెస్ నమ్మడం లేదు: పంజాబ్ కొత్త సీఎం వ్యవహారంపై మాయావతి ఫైర్
లక్నో: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీకి బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. దళితుడైన చన్నీని ముఖ్యమంత్రిని చేయడం కాంగ్రెస్ పార్టీ పోల్ జిమ్మిక్కేనని అన్నారు.
వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందని ధ్వజమెత్తారు మాయావతి. ఈ సందర్భంగా చరణ్జిత్ సింగ్ చన్నీకి మాయావతి శుభాకాంక్షలు తెలియజేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీకి నా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా ఆయన నియామకం ఇంకా ముందుగా జరగాల్సి ఉండేది. ఎన్నికలకు కొన్ని నెలలకు ముందుగా ఈ పదవిని దళిత నేతకు కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీ పోల్ జిమ్మిక్కే అని బీఎస్పీ అధినేత్రి మాయావతి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో వ్యాఖ్యానించారు.
అంతేగాక, వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దళితేతర నేత నేతృత్వంలో ముందుకు వెళుతుందని తాను విన్నట్లు తెలిపారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దళితులను నమ్మడం లేదనే విషయం రుజువైందని మాయావతి వ్యాఖ్యానించారు. పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అకాళీదళ్(ఎస్ఏడీ)-బీఎస్పీ కూటమికి కాంగ్రెస్ భయపడిపోతోందని ఆమె అన్నారు.
పంజాబ్ సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణం
పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణం చేయించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు సుఖిందర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్జిత్ సింగ్ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్ నేత హరీశ్ రావత్ తో కలిసి రాజ్భవన్ చేరుకున్నారు.
కొత్త ముఖ్యమంత్రికి రాహుల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీనే కావడం గమనార్హం. చన్నీ పంజాబ్ మాల్వా బెల్డ్లో రూప్నగర్ జిల్లాలోని చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చరణ్జీత్ అంతకుముందు అమరీందర్ సింగ్ కెబినేట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. ముందు సుఖ్జీందర్ సింగ్ అని వార్తలు వచ్చినా.. కాసేపటికే చరణ్జీత్ సింగ్ పేరును అధిష్టానం ప్రకటించింది. పలు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే, చరణ్ జిత్ సింగ్ చన్నీ దళితుడు కాదని, అతడు క్రిస్టియన్ అని, ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది హిందువులు, సిక్కులను క్రిస్టియన్లుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చన్నీ సోమవారం మధ్యాహ్నం మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను కలవనున్నట్లు తెలిసింది. చన్నీని కెప్టెన్ అమరీందర్ సింగ్ భోజనానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇది ఇలావుంటు. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లోనూ ముఖ్యమంత్రి మార్పు కోరుతూ పార్టీ నేతలు నిరసనకు దిగుతుండటం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను సీఎం పదవి నుంచి దించి.. మరో కీలక నేత సచిన్ పైలట్కు ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.