ఎన్నికల వేళ అసత్య ప్రచారం: కర్ణాటకలో వెబ్సైట్ ఎడిటర్ అరెస్ట్..
బెంగళూరు: రైట్ వింగ్ వెబ్సైట్గా ముద్రపడ్డ 'పోస్ట్ కార్డ్ న్యూస్' ఎడిటర్ మహేష్ విక్రమ్ హెగ్దేను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు వార్తా కథనాలను జనాల్లోకి తీసుకెళ్లినందుకు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
బెంగళూరు నగరంలో ఓ జైన మతగురువుపై ఒక ముస్లిం యువకుడు దాడి చేశాడన్న ఓ అసత్య వార్తను ఎడిటర్ మహేష్ విక్రమ్ ఇటీవల ప్రచురించినట్టు చెబుతున్నారు. అంతేకాదు, 'సిద్దారామయ్య ప్రభుత్వంలో ఎవరికీ భద్రత లేదు' అని పేర్కొంటూ గాయపడిన ఆ మతగురువు ఫోటోలు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో ఆ పోస్టు వైరల్గా మారి వేలమంది షేర్ చేశారు. నిజానికి ఆ మతగురువు కనకపురలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, ఆ ఫోటోను పట్టుకుని ముస్లిం యువకుడి దాడిగా చిత్రీకరించారని తేలింది. దీంతో ఎడిటర్ హెగ్దేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా అతను చేసిన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా పరిణగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. బీజేపీకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికే ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
Shame on the state government led by @siddaramaiah which is behaving in dictatorial terms in arresting @mvmeet. Ensure to follow the true democratic spirit in fighting us rather than doing a coward act. #ReleaseMaheshHegde
— Anantkumar Hegde (@AnantkumarH) March 29, 2018
ఇదో పిరికి చర్య: కేంద్రమంత్రి అనంత్ కుమార్
ఎడిటర్ అరెస్ట్ నేపథ్యంలో అతని విడుదలకు బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్దే సైతం అరెస్టుపై స్పందించారు. 'సిద్దరామయ్య ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోంది. ఎడిటర్ను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రదర్శించాల్సిందిపోయి ఇలాంటి చర్యలకు దిగడం పిరికి చర్య' అని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి కూడా ఎడిటర్ అరెస్టును ఖండించారు. ఈ అరెస్టు ద్వారా సిద్దారామయ్య రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారన్న విషయం ముందుగానే తేలిపోయిందని పేర్కొన్నారు.