విమానాశ్రయంలో పవర్ బ్యాంక్ విసిరికొట్టిన మహిళ, పేలిపోవడంతో కలకలం
న్యూఢిల్లీ: విమానాశ్రయ సిబ్బందితో వాదన సందర్భంగా తన బ్యాగులోని పవర్ బ్యాంకును తీసి బయటకు విసిరివేయడంతో అది పేలింది. ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం జరిగింది.
పవర్ బ్యాంక్ పేలడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పలువురు ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి సదరు మహిళను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన మాళవిక తివారీ బుధవారం ఉదయం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె స్పైస్ జెట్ విమానంలో ఉదయం ధర్మశాలకు వెళ్లవలసి ఉంది. చెకింగ్లో భాగంగా ఆమె బ్యాగును భద్రత సిబ్బంది తనిఖీ చేశారు. వారికి ఓ వస్తువు అనుమానాస్పదంగా అనిపించింది.
దానిని బయటకు తీశారు. అది పవర్ బ్యాంక్. దీనిని లోపలకు అనుమతించమని చెప్పారు. నిబంధనల ప్రకారం దానిని తీసుకు వెళ్లనివ్వమని, అదే విషయాన్ని సదరు మహిళకు తెలియజేశామని తెలిపారు. దానిని చెకిన్ లగేజీలో కాకుండా మరో బ్యాగులో పెట్టుకోమని చెప్పామని, కానీ ఆమె అలా చేయకుండా గొడవ పడ్డారని తెలిపారు.
దీంతో ఆమె తన పవర్ బ్యాంకును కోపంతో విసిరికొట్టిందని చెప్పారు. దానిని గోడకు విసిరి కొట్టడంతో పేలిందని, దీంతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళం ఏర్పడిందన్నారు. ప్రయాణీకులు భయపడ్డారన్నారు. మాళవికను అరెస్టు చేశామని, బెయిల్ పైన విడుదల చేశామని చెప్పారు. ఆ మహిళ వయస్సు 55 ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications