విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరతపై రాష్ట్రాల ఆందోళన; విద్యుత్, బొగ్గు శాఖా మంత్రులతో హోమంత్రి అమిత్ షా భేటీ
భారతదేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందన్న ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంతో విద్యుత్ కోతలకు తెరతీశాయి. కానీ కేంద్రం దేశంలో విద్యుత్ కొరత లేదని, బొగ్గు కొరత ఉన్నప్పటికీ ప్రస్తుత డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తికి కావలసిన బొగ్గు సరఫరా అవుతుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభంపై చర్చ సాగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం బొగ్గు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రులతో సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విద్యుత్ సంక్షోభ భయం .. హోం మంత్రి ఆయా శాఖల మంత్రులతో కీలక సమావేశం
విద్యుత్ సంక్షోభం గురించి చర్చించడానికి సోమవారం ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వరంగ ఎనర్జీ గ్రూప్ ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో బొగ్గు కొరతను నివారించడానికి, అలాగే విద్యుత్ సంక్షోభం నుండి భారతదేశం బయటపడటానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. విద్యుత్ సంక్షోభం భయాల మధ్య బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా హై లెవల్ మీటింగ్ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

దేశంలో విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలలో విద్యుత్ కొరత భయాలను తొలగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ ప్లాంట్ల డిమాండ్ను తీర్చడానికి భారతదేశంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అనేక రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభం గురించి ఆందోళనలోనే ఉన్నాయి.
135 థర్మల్ ప్లాంట్లలో, 106 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఖాళీ
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, దేశం మునుపెన్నడూ లేని విధంగా థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటోంది. ఇది విద్యుత్ సంక్షోభానికి దారితీస్తుంది. అక్టోబర్ 5 న, విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును ఉపయోగించే 135 థర్మల్ ప్లాంట్లలో, 106 ప్లాంట్లు దాదాపు 80 శాతం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి . కేవలం 6-7 రోజులు మాత్రమే నిల్వలు కలిగి ఉన్నాయి. శనివారం ఒక ప్రకటనలో, విద్యుత్ మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలలో బొగ్గు సరఫరా కొరతకు నాలుగు కారణాలను పేర్కొంది .
బొగ్గు కొరతకు కారణాలు ఇవే , సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఫోకస్
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కారణంగా విద్యుత్ కోసం అపూర్వమైన డిమాండ్ పెరగడం ఒక కారణం కాగా, 2021 సెప్టెంబర్లో బొగ్గు గని ప్రాంతాల్లో భారీ వర్షాలు , బొగ్గు ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయనేది రెండో కారణం. దిగుమతి చేసుకున్న బొగ్గు ధరల పెరుగుదల విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన తగ్గింపుకు కారణమైందనేది మూడో కారణం. వర్షాకాలం ప్రారంభానికి ముందు తగినంత బొగ్గు నిల్వలను సేకరించకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా బొగ్గు కొరత కారణంగా, ఏర్పడుతున్న విద్యుత్ సంక్షోభంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మూడు నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రస్తుతం దేశం దృష్టి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై, చేపడుతున్న చర్యలపై నెలకొంది.












Click it and Unblock the Notifications