బొగ్గు కొరతతో దేశానికి విద్యుత్ సంక్షోభం; రాష్ట్రాల ఆలసత్వమే కారణం అంటున్న కేంద్ర విద్యుత్ శాఖ
బొగ్గు దిగుమతులపై రాష్ట్రాల అలసత్వం కారణంగా భారతదేశ విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. బొగ్గును దిగుమతి చేసుకోవడంలో రాష్ట్రాలు అలసత్వం వహించడం, విద్యుత్ ప్లాంట్లతో ఒప్పంద సమస్యలను పరిష్కరించక పోవడం వల్ల రానున్న నెలల్లో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
దేశానికి బొగ్గు కష్టాలు .. పెరిగిన విద్యుత్ డిమాండ్ తో ఇబ్బందులు
ఇంతకు ముందు వారాంతంలో డిమాండ్ తగ్గినందున శనివారం స్వల్ప ఉపశమనం లభించింది. అయితే మే 2 వరకు వాయువ్య మరియు మధ్య భారతదేశంలో హీట్వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ మళ్ళీ పెరిగింది. భారతదేశం యొక్క గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం అన్ని రికార్డులను బద్దలు కొట్టి 207 గిగా వాట్లకి చేరుకుంది. పవర్ స్టేషన్లలో తొమ్మిది రోజులకు సరిపడా 21 మిలియన్ టన్నుల (MT) బొగ్గు నిల్వ లభ్యతను అధికారిక డేటా చూపించింది.
బొగ్గు ధరల పెరుగుదల నేపధ్యంలో బొగ్గు కొనుగోలు చెయ్యలేం అంటున్న రాష్ట్రాలు
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకున్నప్పటికీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు మరియు గుజరాత్ దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్రాజెక్టులతో సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది. ఇది దేశీయ బొగ్గు సరఫరాపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. రాష్ట్రాలు తాము ఖరీదైన బొగ్గును కొనుగోలు చేయలేమని చెప్తున్నాయి . దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో టన్నుకు 288 డాలర్లు (హెచ్బిఎ ఇండెక్స్) ఉన్నాయని, ఇవి కొనుగోలు చేసేలా రాష్ట్రాలకి అందుబాటులో లేవని తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అధిక ధరల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రెండు బొగ్గు దిగుమతి టెండర్ల రద్దు
దిగుమతి చేసుకున్న బొగ్గు రవాణాకు ఎక్కువ రైల్వే రేక్లు అవసరమవుతాయని, ప్రస్తుతం పవర్ స్టేషన్లలో నిల్వలు తక్కువగా ఉండటానికి వీటి కొరత ప్రధాన కారణమని కర్ణాటకలోని ఒక అధికారి తెలిపారు. అధిక ధరల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రెండు బొగ్గు దిగుమతి టెండర్లను రద్దు చేసిందని ఒక అధికారి తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభానికి బొగ్గు కొరత కారణమని, కేంద్రానిదే బాధ్యత అని ఆరోపించారు.
రాష్ట్రాల డిస్కమ్లు విద్యుత్ ప్లాంట్లకు బకాయిలను చెల్లించలేదు
అయితే, ఈ రాష్ట్రాలు కోల్ ఇండియా లిమిటెడ్ బకాయిలను క్లియర్ చేయలేదని మరియు స్టాక్లను సిద్ధం చెయ్యలేదని కేంద్రం తెలిపింది. ఈ రాష్ట్రాలు కోల్ ఇండియాకు ఏకంగా 7,918 కోట్ల రూపాయలు బకాయిపడ్డాయని పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల డిస్కమ్లు విద్యుత్ ప్లాంట్లకు బకాయిలను చెల్లించలేదని, దీంతో బొగ్గును కొనుగోలు చేయలేమని కేంద్రం చెప్తుంది. ఏది ఏమైనా బొగ్గు కొరత తీవ్రంగా మారటంతో విద్యుత్ కొరత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అధిగమిస్తాయో వేచి చూడాలి.