తప్పైపోయింది బై..: లెంపలేసుకున్న ప్రశాంత్ కిశోర్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులని విజయాన్ని అందుకుంది.. జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. 202 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి మట్టికరిచింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 35 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ- 91, జేడీయూ- 81 స్థానాల్లో గెలిచాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా అయిదోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న జన్ సురాజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు.
ఈ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ తాజాగా స్పందించారు. జన్ సురాజ్ పార్టీ ఓటమికి వంద శాతం తనదే బాధ్యత అని అన్నారు. ఇందుకోసం క్షమాపణ చెప్పారు. ఈ పరాజయాన్ని అంగీకరిస్తున్నానని, పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. ప్రభుత్వం మార్చడంలో విఫలం అయ్యానని చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజలకు తమ ఆలోచనలను సరిగ్గా తెలియజేయలేకపోయామని పేర్కొన్నారు.

ప్రజల్లో మార్పు తీసుకుని రావడానికి, అవినీతిమయమైన ప్రభుత్వాన్ని మార్చడానికి శక్తివంచలేకుండా ప్రయత్నించామని, అనుకున్న గమ్యానికి చేరుకోవడంలో విఫలం అయ్యామని అన్నారు. ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తోందని, దాని గురించి సమీక్షించుకుంటామని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ప్రజలకు అర్థం అయ్యేలా తమ ప్రణాళికలను తెలియజేయడంలో విఫలం అయ్యాననిపిస్తోందని, అందుకే వంద శాతం పార్టీ ఓటమి బాధ్యతను తనపైనే వేసుకుంటోన్నానని, ఆత్మపరిశీలన చేసుకుంటానని అన్నారు. తనను క్షమించాలని చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో ఎక్స్ ఫాక్టర్ గా గుర్తింపు పొందిన రాజకీయ మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే ప్రజల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. జన్ సూరాజ్ పార్టీని నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేశారు. తాను స్వయంగా ఎన్నికల బరిలో దిగితే పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే వ్యూహాలపై ఏకాగ్రత తప్పుతుందనే కారణంతో ఆయన పోటీ కూడా చేయలేదు. చివరి నిమిషంలో తప్పుకొన్నారు. అయినా ఒక్కరు కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.












Click it and Unblock the Notifications