ఎఫ్-15 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కు ప్రత్యూష్ కుమార్ నేతృత్వం: బోయింగ్ సంస్థ
బెంగళూరు: ప్రముఖ విమానాయాన సంస్థ బోయింగ్ తమ సంస్థ నుంచి ఉత్పత్తి కానున్న ఎఫ్-15 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కు నేతృత్వం వహించాల్సిందిగా భారత్కు చెందిన ప్రత్యూష్ కుమార్ను నియమించింది. ప్రస్తుతం ప్రత్యూష్ కుమార్ బోయింగ్ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్గా ఉన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ సంస్థల్లో ఎఫ్-15 యుద్ధ విమానాల తయారీకి ప్రత్యూష్ కుమార్ నేతృత్వం వహిస్తారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
బోయింగ్ సంస్థ ప్రకటనతో తనపై బాధ్యతలు మరింత పెరిగాయని ప్రత్యూష్ కుమార్ తెలిపారు. భారత్లో కూడా నూతన ఆవిష్కరణలను, సాంకేతికతను, ఉత్పత్తులను బోయింగ్ సంస్థ మరింత విస్తరిస్తుందని ప్రత్యూష్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే ప్రత్యూష్ కుమార్ అమెరికాకు వెళ్లిపోతుండటంతో ఇండియాలో తమ ఆపరేషన్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారో బోయింగ్ సంస్థ త్వరలోనే మరో ప్రకటన చేయనుంది. ఇక ఐదేళ్ల పాటు భారత్లో సేవలందించిన ప్రత్యూష్ కుమార్ కంపెనీ లాభాల్లో నడిచేందుకు తన శాయశక్తుల పనిచేశారు.
ప్రత్యూష్ కుమార్ హయాంలో బెంగళూరులో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించినట్లు, ఏరోస్పేస్ సప్లై చైన్ రంగంలో వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు టాటా సహకారంతో హైదరాబాద్లో అపాచీ అటాక్ హెలికాఫ్టర్ల మెయిన్ బాడీ సెక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేయగలిగామని ప్రత్యూష్ కుమార్ ను కొనియాడింది బోయింగ్ సంస్థ. అంతేకాదు అపాచీ, చినూక్ తరహా చాపర్లను భారత మిలటరీకి విక్రయించడంలో కుమార్ కీలక పాత్ర పోషించినట్లు సంస్థ పేర్కొంది. ఇక సెప్టెంబర్ 24న ప్రత్యూష్ కుమార్ కర్నాటక సీఎం కుమార స్వామిని కలిసి బోయింగ్ ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ అండ్ ఏవియానిక్స్ అసెంబ్లీ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు చర్చలు జరిపారని బోయింగ్ సంస్థ తెలిపింది. ఇందుకు 1,152 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. 18 నెలల సమయంలో ఈ కంపెనీ పూర్తయి 2600 మందికి ఉపాధి హామీ కల్పించనున్నట్లు తెలుస్తోంది.