బెంగళూరులో నమ్మ మెట్రో గ్రీన్ లైన్ సేవలు: జాతికి అంకితం చేసిన ప్రణబ్ ముఖర్జీ
బెంగళూరు: బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) సంపిగే నుంచి యలచేనహళ్ళి మొదటి స్టేజ్ గ్రీన్ లైన్ సేవలను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బెంగళూరు దక్షిణ విభాగంలో మెట్రో గ్రీన్ లైన్ సేవలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.
సంసిగే ప్రాంతం నుంచి యలచేనహళ్ళికి రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే కనీసం నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. మెట్రో గ్రీన్ లైన్ సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు వారి సమయం ఆదా చేసుకునే అవకాశం ఉంది.
అతి తక్కువ ఖర్చు (చార్జీలు)తో ప్రతి రోజు మెట్రో రైలులో సంచరించడానికి చక్కటి అవకాశం ఉంది. కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజస్టిక్)లో సూచన ఫలకాలు ( బోర్డులు), టిక్కెట్ ధర ఎంత, మెట్రో రైలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది, బయలుదేరే వేళలు ఎప్పుడు అనే పూర్తి వివరాలు అందరికి అందుబాటులోకి తీసుకు వచ్చారు.
మెట్రో రైలు ప్రయాణికులకు సహాయం చెయ్యడానికి, పూర్తి సమాచారం వివరించడానికి (కన్నడతో పాటు తెలుగు, తమిళ. హిందీ, ఆంగ్లం) మెజస్టిక్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. మెట్రో రైలులో ఎవరెవరు సంచరిస్తున్నారు అని పూర్తి వివరాలు సేకరించడానికి ప్రత్యేకంగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మెట్రో రైల్వే స్టేషన్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.