జైలులో లాలూను కలిసిన రాష్ట్రపతి తనయుడు
రాంచీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అభిజిత్ ముఖర్జీ జైలులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను కలిశారు. లాలూను కలవడానికి జంగీపూర్ పార్లమెంటు సభ్యుడు అభిజిత్ ముఖర్జీ ఆదివార రాంచీలోని బిర్సా ముండా జైలుకు వచ్చారు.
దాణా కుంభకోణం కేసులో సెప్టెంబర్ 30వ తేదీన సిబిఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు మరో 44 మందికి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నెల 17వ తేదీన జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లనున్నారు.
రాజ్రప్పకు వెళ్తూ అభిజిత్ ముఖర్జీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను కూడా కలుసుకున్నారు. అభిజిత్ ముఖర్జీ లాలూ ప్రసాద్ యాదవ్తో అరగంట పాటు ఉన్నారు. మర్యాదపూర్వకంగానే అభిజితే లాలూను కలుసుకున్నట్లు చెబుతున్నారు.
దాణా కుంభకోణం కేసులో శిక్ష పడడంతో లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. కేసులో శిక్ష పడి పదవిని కోల్పోయిన రెండో పార్లమెంటు సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇంతకు ముందు మెడికల్ సీట్ల కుంభకోణంలో రషీద్ మసూద్ తన పదవిని కోల్పోయారు.