రాష్ట్రానికి తెలంగాణ బిల్లు: జనవరి 23 వరకు గడువు
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్కు పంపించారు. జనవరి 23వ తేదీ వరకు అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇచ్చారు. తెలంగాణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం గురువారం ఉదయం పంపించింది. బిల్లుపై శాసన సభ అభిప్రాయం ఆరు వారాలు అంటే జనవరి 23లోగా చెప్పాలని గడువు ఇచ్చింది.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు గురువారం రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయని బుధవారం నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లు ఫైల్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసి కేంద్ర హోం శాఖకు పంపించారు. అనంతరం బిల్లు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శికి వచ్చింది.
అభిప్రాయం చెప్పేందుకు అసెంబ్లీకి ఆరువారాల సమయం ఇస్తారని మొదటి నుండి అందరూ భావించారు. రాష్ట్రానికి బిల్లు వచ్చినందున తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు వెంటనే అసెంబ్లీ ముందుకు తీసుకు రావాలని పట్టుబట్టే అవకాశముంది.