దేశాభివృద్దిలో రైతుల పాత్ర ఎంతో కీలకం.!చౌరీ చౌరా ఘటనకు వందేళ్ల సందర్బంగా ప్రధాని మోదీ ఉద్ఘాటన.!
ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ రైతులను ప్రశంసలతో ముంచెత్తారు. వ్యవసాయ రంగాభివృద్దితో పాటు రైతు స్వావలంబన కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో చర్యలు తీసుకుందని వెల్లడించారు. అంతే కాకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో రైతుల పాత్ర ఎంతో కీలకమన్నారు ప్రధాని మోదీ. చౌరీ చౌరాకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న మోదీ చౌరా చౌరీ ఘటన కొన్ని కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిల్చిందని గుర్తు చేసారు ప్రధాని మోదీ.
దేశాభివృద్ధికి రైతులే వెన్నెముకన్న మోదీ..చౌరీ చౌరా ఘటనకు వందేళ్ల కార్యక్రమంలో వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకూ ఆ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి రైతులే వెన్నెముక అని ప్రసంగించారు. చౌరీ చౌరా సహా స్వాతంత్ర్య సంగ్రామంలో వారి పాత్ర మరువలేనిదని గుర్తు చేసారు. గురువారం చౌరీ చౌరా ఘటనకు వందేళ్లు అయిన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా రైతుల పాత్ర కీలకం.. రైతు సేవలను కొనియాడిన ప్రధాని..
ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతో కీలకమన్నారు. దేశ రైతుల అభ్యుదయం కోసం గత ఆరేళ్లలో ఎన్నో బృహత్కర చర్యలు తీసుకున్నామని, రైతుల స్వావలంబన కోసం పలు పథకాలు తీసుకొచ్చామన్నారు మోదీ. మండీలతో రైతులు లాభపడేలా వాటిని ఆన్ లైన్ కు అనుసంధానించామని, మరో వెయ్యి మండీలనూ ఈనామ్ కు అనుసంధానించబోతున్నామని, ఇలాంటి చర్యల వల్లే కరోనా మహమ్మారి సమయంలోనూ వ్యవసాయ రంగం ఎనలేని వృద్ధిని సాధించింది అని మోదీ అన్నారు.
రైతు సేవలు స్పూర్తి దాయకం.. చౌరీ చౌరా ఘటనలో రైతులు ప్రాణాలు కోల్పోవడవం దురదృష్టకరమన్న మోదీ..
అంతే కాకుండా చౌరీ చౌరా ఘటనలో అమరులైన వారిని స్మరించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్ర పుటల్లో వారి త్యాగాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. ఈ నేలపై చిందిన వారి రక్తం మాత్రం ఎప్పటికీ అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని కొనియాడారు. చౌరీ చౌరా ఘటన ఒక్క పోలీస్ స్టేషన్ కే పరిమితం కాదన్నారు. ఆ స్టేషన్ కు పెట్టిన నిప్పు కొన్ని కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిల్చిందని మోదీ ప్రసంగించారు.
రైతులు ఎన్నో త్యాగాలు చేసారు.. వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్న మోదీ..
అయితే, కొన్ని కారణాల వల్ల చౌరీ చౌరా పోరాటాన్ని కొంతమంది చిన్న ఘటనగానే చిత్రీకరించారని, దేశ ఐకమత్యమే మన ప్రాధాన్యం కావాలని, దానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐక్యతకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. కాగా, 1922లో జరిగిన చౌరీ చౌరా పోరాటంలో భాగంగా అక్కడి పోలీస్ స్టేషన్ కు ఉద్యమకారులు నిప్పు పెట్టారని గుర్తు చేసారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ..
ఆనాడు జరిగిన సంఘటనలో 23 మంది పోలీసులు చనిపోయారని, ఆ దుర్ఘటనతో మహాత్మా గాంధీ, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉన్న పళంగా నిలిపేశారని మోదీ గుర్తు చేసారు. ఘటనకు సంబంధించి వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, 228 మందిపై విచారించారని, విచారణ సమయంలోనే ఆరుగురు చనిపోగా, 172 మందికి కోర్టు ఉరిశిక్ష విధించిందన్నారు ప్రధాని మోదీ. మిగతా వారికి జీవిత ఖైదును విధించింది. ఈ విచారణ దాదాపు 8 నెలల పాటు సాగింది మోదీ స్పష్టం చేసారు.