హిమాచల్ సీఎంను డిసైడ్ చేయబోతున్న ప్రియాంక -కాంగ్రెస్ విజయం ఆమె ఖాతాలోనే..
హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు చేరుకున్న కాంగ్రెస్ అధిష్టానం దూతలు ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. అందులో సీఎంను నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీకే అప్పగించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విజయానికి కారణమైన ప్రియాంక గాంధీ చేతుల్లో దీన్ని పెట్టినట్లు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్ధి రేసులో మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్ని దగ్గరుండి సమీక్షించి అభ్యర్ధుల్ని సైతం ఎంపిక చేసిన ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్ధిని కూడా నిర్ణయిస్తే బావుంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం పదవి ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.
నిన్న సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న పార్టీ దూతలు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేష్ బఘేల్ల వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో అంచనా వేసేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ ప్రాబల్యం ఉన్న సిమ్లాలో సమావేశానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మద్దతుదారులు తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత హైకమాండ్ కు సీఎం ఎంపిక అధికారం కట్టబెట్టారు. రేసులో ఆమెతో పాటు సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి ఉన్నారు. వీరిద్దరూ సిమ్లాకు కొంత దూరంలో ఉన్న ప్రాంతాలలో వీరికి మద్దతు లభిస్తోంది. దీంతో ప్రియాంక నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.