బాలీవుడ్ నటి హేమమాలిని ఆభరణాలు చోరి
బాలీవుడ్ నటి హేమ మాలిని గోడౌన్ నుండి ఆభరణాలు చోరికి గురయ్యాయి.గోడౌన్లో పనిచేసే పనిమనిషి ఆభరణాలు దొంగిలించారనే అనుమానంపోలీసులకు ఫిర్యాదు చేసిన హేమ మాలిని
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి, డ్రీమ్గర్ల్ హేమమాలినికి చెందిన దుస్తులు, గిల్టు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.ఈ విషయమై హేమ మాలిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హేమమాలిని తన నృత్య ప్రదర్శనలకు వినియోగించే క్యాస్టూమ్స్, ఇమిటేషన్ ఆభరణాలను అంథేరీలోని ఓ గోదాంలో దాచారు. వాటిని ఎవరో దొంగిలించారని హేమమాలిని జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాంలో పనిచేసే పనిమనిషి అదృశ్యం అయిందని ఆమె కోసం ఫోన్ లో సంప్రదించినా కలవలేదని హేమమాలిని మేనేజరు పోలీసులకు చెప్పారు.
హేమమాలిని స్టేజీ షోలలో ధరించే దుస్తులు, గిల్టు ఆభరణాల విలువ 90వేల రూపాయలని పోలీసులు చెప్పారు. తాము కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
2010వ సంవత్సరంలో హేమమాలినికి చెందిన గోరేగామ్ బంగళా నుంచి 80 లక్షల రూపాయల విలువ గల నగలను ఇంటి పనిమనిషి ఎత్తుకెళ్లింది. కాగా అసలు నగలని భావించి గోదాంలోని గిల్టు నగలను ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.