2001 తర్వాత అతిపెద్ద టెర్రర్ దాడి: వారి త్యాగం వృథాకాదు.. స్పందించిన నరేంద్ర మోడీ
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 39కు చేరింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులతో మాట్లాడారు. గత ఇరవై ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన దాడి జరిగిన దాఖలాలు లేవని చెబుతున్నారు. పుల్వామాలో ఇదే అతిపెద్ద దాడి అని, అలాగే 2001 తర్వాత, 2016 యూరి దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడి.
జమ్ము నుంచి శ్రీనగర్కు 70 కాన్వాయ్లలో 2500 మంది జవాన్లు వెళ్తున్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అవంతిపురా సమీపంలోకి రాగానే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు జవాన్లు మృతి చెందగా, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. దాడికి తామే కారణమని జైష్ ఏ మహ్మద్ ప్రకటన చేసింది.
ఉగ్రవాదులు తొలుత ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. కారులో బాంబు పేల్చారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ రాగానే ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. పేలుడు కోసం స్కార్పియోలో 350 పేజీల పేలుడు పదార్థాలను తరలించారు.
ఈ పేలుడు నేపథ్యంలో రేపటి పాట్నా పర్యటనను రాజ్ నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. రేపు శ్రీనగర్లో పర్యటించనున్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. అమరుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దాడిని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు.
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మోడీ
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమరుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పారు. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. సైనికుల త్యాగం వృథా కాదని చెప్పారు.
పుల్వామా దాడిపై సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ స్పందించారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఘటనాస్థలికి ఉన్నతాధికారులు వెళ్లారని చెప్పారు. ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాఫ్తు జరుగుతోందని చెప్పారు. సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారని చెప్పారు.