మద్యం సేవిస్తే చీపుర్లు తిరగేస్తాం, సన్మానం
పాట్నా: మద్యం మత్తులో చిందులు వేస్తే చీపురు తిరగేస్తామని, చీపురు కట్టలతో సన్మానం చేస్తామని బీహార్ లోని పలు గ్రామాలలో నివాసం ఉంటున్న మహిళలు హెచ్చరిస్తున్నారు. నిత్యం మద్యం సేవించడం వలనే మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు వాపోతున్నారు.
మద్యం సేవించినా, మద్యం విక్రయించినా చీపురు కట్టలతో చితక్కొట్టాలని గ్రామ పంచాయితీ మహిళా నాయకులు, పలు మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. బీహార్ లోని షేక్ పూర్ జిల్లాలోని రంజాన్ పూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలలోని గ్రామాలలో మహిళలలో చైతన్యం తీసుకురావడానికి పోస్టర్లు అతికించారు.
రంజాన్పూర్ పంచాయితీ నాయకురాలు శమాదేవి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బీహార్ లోని గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాల (బెల్ట్ షాప్)కు అడ్డుకట్ట వెయ్యడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అంటున్నారు.
తమ పాలిట శాపంగా మారిన ఈ మద్యం భూతాన్ని అంతం చెయ్యడానికి ప్రతి గ్రామంలో పోస్టర్లు అతికించి మహిళలలో చైతన్యం తీసుకు వచ్చి వారి కాపురాలు బాగుపడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆమె చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఉద్యమం లేవడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు షాక్ కు గురైనారు.