దేశ చరిత్రలో తొలిసారి: పార్లమెంటులో సినిమా ట్రైలర్ రిలీజ్
ముంబై: దేశ చరిత్రలో తొలిసారి ఓ సినిమా ట్రైలర్ భారత పార్లమెంటులో విడుదలవబోతోంది. ఇప్పటి వరకు చాలా సినిమాలు అభిమానుల మధ్యలో భారీ వేదికలపై, లేదా నేరుగా ఆన్లైన్లో విడుదల చేసిన సందర్భాలే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఏకంగా చట్టాలు రూపొందించే పార్లమెంటులోనే విడుదల చేస్తుండటం సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా 'రాగ్దేశ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్ను పార్లమెంట్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ధులియా మీడియాకు వెల్లడించారు.
'దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముగ్గురు ఐఎన్ఎస్ అధికారులు ఏం చేశారు అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ చిత్ర ట్రైలర్ను పార్లమెంట్లో విడుదల చేయబోతున్నాం. పార్లమెంట్ ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది మా సినిమాకు ఎంతో గౌరవం' అని ధులియా తెలిపారు.
అయితే, ఎప్పుడే ట్రైలర్ విడుదల చేస్తామనేదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వా నటించారు. గుర్దీప్ సింగ్ సప్పల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జులై 28న ఈ చిత్రం విడుదల కానుంది.