కేంద్రం పెగాసస్ స్పైవేర్ కొనుగోళ్లు నిజమే-తాజా రిపోర్ట్-మోడీ సర్కార్ దొరికిపోయిందన్న రాహుల్
కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను రక్షణ అవసరాల కోసం కొనుగోలు చేసినట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన వార్తాకథనం భారత్ లో కాకరేపుతోంది. ముఖ్యంగా మోడీ సర్కార్ పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసిందా లేదా అన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్రం దేశ రక్షణ అవసరాల కోసం ఈ స్పైవేర్ ను 2017లో సమకూర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. దీంతో కేంద్రంపై విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
ఇజ్రాయెల్తో ఒప్పందంలో భాగంగా కేంద్రం 2017లో పెగాసస్ గూఢచార్య స్పైవేర్ ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల్లో నేతలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందని, అధికార పక్షం, ప్రతిపక్షం, న్యాయస్థానాల్ని టార్గెట్ చేసి వారి ఫోన్ ట్యాప్ చేసిందని రాహుల్ విమర్శించారు. ఇది దేశద్రోహం.. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది' అని ఆయన ట్వీట్ చేశారు.

Recommended Video
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ... మోదీ ప్రభుత్వం భారత్కు శత్రువుల్లా ప్రవర్తించి భారత పౌరులపై యుద్ధ ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించిందని నిలదీశారు. పెగాసస్ను ఉపయోగించి అక్రమంగా స్నూపింగ్ చేయడం దేశద్రోహానికి సమానమని చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తాము బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ ప్రతినిధి షామా మహ్మద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా భారత పౌరులపై స్నూప్ చేయడానికి బిజెపి ప్రభుత్వం మిలిటరీ-గ్రేడ్ స్పైవేర్ను ఉపయోగించిందనడానికి ఇది "తిరుగులేని రుజువు" అని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదికలో బహిర్గతమైన అంశాలు సుప్రీంకోర్టును, పార్లమెంటును కేంద్రం తప్పుదోవ పట్టించినట్లు నిర్ధారిస్తున్నాయని, రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications