యూపీఎస్సీ ఛైర్మన్ గా బీజేపీ వ్యక్తా ? యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్ అన్న రాహుల్ గాంధీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ గా తాజాగా కేంద్రం మనోజ్ సోనిని నియమించింది. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ నియామకం కాస్తా రాజకీయాలకు తావిచ్చింది. మనోజ్ సోనీకి బీజేపీ,ఆరెస్సెస్ తో సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
యూపీఎస్సీ ఛైర్మన్ గా నియమించిన మనోజ్ సోనీకి బీజేపీ, ఆరెస్సెస్ తో సంబంధాలు ఉన్నాయంటూ ద వైర్ వెబ్ సైట్ ప్రచురించిన ఓ కథనానాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో గతంలో యూపీఎస్సీ ఛైర్మన్ గా మేటి విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లను నియమించే వారని, కానీ సోనీ నియామకం చూస్తుంటే దేశంలో జరుగుతున్న కాషాయీకరణలో భాగంగా కనిపిస్తోందని ఈ కథనం ఆరోపించింది. ఈ కథనాన్ని ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
యూపీఎస్సీ ఛైర్మన్ గా మనోజ్ సోనీ నియామకాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీని యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్ అంటూ అభివర్ణించారు. భారత్ లో రాజ్యాంగం నాశనమవుతోందని, ఒక్కో సంస్ధ ఒక్కోసారి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తద్వారా కేంద్రం ప్రతిష్టాత్మక జాతీయ సంస్ధల్లో సైతం కాషాయీకరణను ప్రోత్సహిస్తోందనే అర్ధం వచ్చేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ ఛైర్మన్ గా నియమించిన మనోజ్ సోనీ అర్హతలపైనా చర్చ జరుగుతోంది.
Union Pracharak Sangh Commission.
— Rahul Gandhi (@RahulGandhi) April 18, 2022
India’s Constitution is being demolished, one Institution at a time. pic.twitter.com/8HEMnmVyTo
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి సంస్ధల్లో తమ వ్యక్తుల్ని నియమించుకుంటోందని రాహుల్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు యూపీఎస్సీ వంటి సంస్ధకు అధిపతిగా మనోజ్ సోనీని నియమించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విపక్షాలు ప్రశ్నిస్తున్నా కేంద్రం మాత్రం మౌనంగా ఉండిపోతోంది.