కాంగ్రెస్ చీఫ్గా మరో 4 నెలలు రాహులే ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశానని బెట్టుచేసిన రాహుల్ గాంధీ వీడినట్టు కనిపిస్తోంది. మరికొద్దిరోజులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి ప్రత్యామ్నాయ నేత లభించేవరకు తాను అధ్యక్ష పదవీలో కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు రాహుల్ తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఓటమికి బాధ్యత వహిస్తూ ..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తీవ్ర మనస్థాపం చెందిన రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఇదే విషయం తెలిపారు. అయితే ఆయన నిర్ణయాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. కానీ సీనియర్ నేతలేవరు తనకు సహకరించలేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. తర్వాత నేతలేవరికీ అందుబాటులో లేకుండా పోవడం .. ఫోన్ స్విచాప్ చేయడంతో కాంగ్రెస్ నేతలు హడలిపోయారు. ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రియాంక తదితర ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ఇంటికెళ్లి నచ్చజెప్పారు. యూపీఏ భాగస్వామ్య పక్ష నేత, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ అధ్యక్ష పదవీ నుంచి వైదొలగొద్దని సూచించారు.
4 నెలలు కంటిన్యూ ..
అధ్యక్ష పదవీ వీడతానంటే అన్నివర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో రాహుల్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరో 4 నెలల వరకు అధ్యక్ష పదవీ చేపడుతామని చెప్పినట్టు సమాచారం. కానీ అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సమర్థమైన నేతను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్ష పదవీ కోసం బలమైన నేత దొరికేవరకు పార్టీ చీఫ్ గా కొనసాగుతామని రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది. అప్పటివరకు పార్టీ చీఫ్ గా ఉంటూ .. ప్రక్షాళన చేసేందుకు అతనికి సీడబ్ల్యూసీ హామీనిచ్చింది. పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసేందుకు .. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకునే వరకు హక్కులు కల్పిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను పార్టీలో మరిన్ని మార్పులు చేసేందుకు సమయం లభించినట్టైంది.
అంతా మీరే చేశారు ..?
ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్లపై రాహుల్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిదంబరం, కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ లాంటి నేతలు తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకొని .. వారి గెలుపు కోసం పనిచేశారని విమర్శించారు. వారికి కొడుకులు, బంధువులే ముఖ్యం తప్పా .. పార్టీ కాదని .. అందుకే పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. రాహుల్ ఆరోపణలకు బలం చేకూరేలా ప్రియాంక గాంధీ కూడా వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమికి కారణమైన వారు సమావేశంలోనే ఉన్నారని ఆరోపించారు.