వాయనాడ్లో మకాం: వచ్చేనెల వెళ్లనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కేరళలోని వాయనాడ్కు వెళ్లనున్నారు. కొద్దిరోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆయన వాయనాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుమారు ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాహుల్.. వాయనాడ్ పర్యటనకు వెళ్లబోతుండటం ఇదే తొలిసారి.
మోడీ కేబినెట్ ఇన్ యాక్షన్: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
తనను గెలిపించిన వాయనాడ్ ఓటర్లకు ధన్యవాదాలు తెలపడంతో పాటు కొద్దిరోజులు అక్కడే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. రెండురోజులు వాయనాడ్లో పర్యటించాలని నిర్ణయించుకున్నప్పటికీ.. పరిస్థితులకు అనుగుణంగా.. దీన్ని పొడిగించడానికి అవకాశాలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీలో స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. పార్టీ కూడా దారుణ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఓటమి భారంలో ఉన్నారాయన. పెద్దగా ఎవర్నీ కలుసుకోలేదు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి అందజేశారు.
రాజీనామా ఉపసంహరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆయనపై ఒత్తిళ్లు వచ్చాయి. యూపీఏలోని పలు భాగస్వామ్య పక్షాలు సైతం రాజీనామా చేయొద్దని కోరాయి. ఇదిలావుండగా- వచ్చే నెల 7వ తేదీ నుంచి వాయనాడ్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పర్యటిస్తారని కేరళ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. దీనికి సంబంధించిన రూట్మ్యాప్ను వారు సిద్ధం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ లోక్సభ స్థానంలో రాహుల్ 4,31,063 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థి పీపీ సునీర్పై రాహుల్ ఘన విజయం సాధించారు.
కాగా- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని మాతృపార్టీ కాంగ్రెస్లో విలీనం చేసే విషయంపై రాహుల్ గాంధీ ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్తో మంతనాలు సాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతిపాదనలేవీ ఎన్సీపీ సమక్షానికి రాలేదు. పార్టీ విలీనం అంశాన్ని రాహుల్ గాంధీ తమ నాయకుడి వద్ద ప్రస్తావించినట్లు ఎన్సీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీనిపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోవచ్చని అంటున్నారు. సంస్థాగతంగా పార్టీ నాయకులతో చర్చించిన తరువాతే విలీనంపై ఓ నిర్ణయానికి వస్తామని ఎన్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.