ఎయిమ్స్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను పరామర్శించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మన్మోహన్ సింగ్కు జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ.. దాదాపు అరగంటపాటు అక్కడేవున్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ను ఆయన కలిశారు. మన్మోహన్ సింగ్కు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రాహుల్ గాంధీ.
కాగా, ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మన్మోహన్ కు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. మన్మోహన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఒక సందేశం పోస్టు చేశారు. 'మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని.. ఆయన ఆరోగ్యవంతంగా జీవించాలనీ ప్రార్థిస్తున్నాను' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిను గురించి తెలుసుకోవడానికి గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా ఢిల్లీలోని ఎయిమ్స్ సందర్శించారు. 'మన్మోహన్ సింగ్ కొన్ని అనారోగ్య ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది' అని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక హ్యాండిల్లో ఒక ట్వీట్ను పోస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో సింగ్ గతంలో ఎయిమ్స్లో చేరారు. రెండుసార్లు ప్రధానిగా ఉన్న ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 26 న జరుపుకున్నారు. గత సంవత్సరం కూడా, మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందారు.
మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయననను ఎయిమ్స్లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు మోతాదుల కరోనా వ్యాక్సిన్లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు.
Recommended Video
కాగా, సెప్టెంబర్ 26, 1932న బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలో భారతదేశంలోని పంజాబ్లోని గాహ్లో (ప్రస్తుత పాకిస్తాన్లో పంజాబ్) జన్మించారు మన్మోహన్ సింగ్, తన కెరీర్లో వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 1982 నుండి 1985 వరకు, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్గా, 1985 నుంచి 1987 వరకు, ఆయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్గా పనిచేశారు. 1991లో, ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్గా నియమితులయ్యారు. 2004-2014లో ప్రధానమంత్రిగా సింగ్ పదవీకాలం ముగిసింది.