ఇండియా-చైనా .. మధ్యలో రష్యా ... చైనాతో ఉద్రిక్తతల సమయంలో రష్యా పర్యటనకు మంత్రి రాజ్ నాథ్ సింగ్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు ఉదయం రష్యాకు బయలుదేరారు. రష్యా రాజధాని మాస్కోలో మూడు రోజులపాటు కొనసాగనున్న ఆయన పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. భారత్ రష్యాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపనున్న రాజ్ నాథ్ సింగ్ రెండో ప్రపంచ యుద్ధం 75 వ విజయోత్సవ దినోత్సవం పెరేడ్ లో పాల్గొంటారు. అయితే చైనా మంత్రులతో కూడా అక్కడ సమావేశం జరగనుండటంతో భారత్ చైనా బోర్డర్ టెన్షన్ విషయంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

రష్యా వేదికగా రష్యా -ఇండియా- చైనా త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి సూచికగా మాస్కోలో ప్రతి సంవత్సరం రష్యా విక్టరీ పరేడ్ ను నిర్వహిస్తుంది. ఇది మే 9నే జరగాల్సిన కరోనా కారణంగా జూన్ 23కు వాయిదా పడింది. ఇక ఈ పెరేడ్ లో కేంద్ర రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ పాల్గొననున్న నేపధ్యంలో చైనా కూడా ఈ పెరేడ్ కు హాజరవుతుంది కాబట్టి ఆసక్తి నెలకొంది . జూన్ 23న రష్యా -ఇండియా- చైనా త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ఆతిథ్యం ఇస్తుండగా, జూన్ 24 న జరిగే విక్టరీ డే పెరేడ్ లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఒకపక్క చైనాతో భారతదేశ సరిహద్దున ఉద్రిక్తత నెలకొన్న సమయంలో రాజ్ నాథ్ సింగ్ రష్యా పర్యటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

టెన్షన్ సమయంలో రష్యాలో కలవనున్న ఇండియా , చైనా రక్షణా మంత్రులు
భారత్ చైనాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని, యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చైనా కు దీటుగా బదులివ్వాలని ఆర్మీకి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇలాంటి సమయంలో రష్యా వేదికగా చైనా, భారత దేశ రక్షణ మంత్రులు ఇద్దరూ ఒకే వేదిక మీదికి రానుండడం ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. మాస్కో లో జరగనున్న రష్యా విక్టరీ పెరేడ్ లో ఇటు భారత్ రక్షణ మంత్రి, అటు చైనా రక్షణ మంత్రి పాల్గొననున్నారు.

ఇండియా , చైనా ల మధ్య మధ్యవర్తిత్వం నెరపనున్న రష్యా
ఇక రష్యా అధ్యక్ష ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ చైనా భారతదేశం మధ్య సరిహద్దులో మిలిట్రీ ఘర్షణలపై ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుందని, ఇక ఈ వివాదాన్ని ఇరు దేశాలు స్వయంగా పరిష్కరించగలవని నమ్ముతున్నామని పేర్కొన్నారు. భారత్ చైనా సరిహద్దు లో ఏం జరుగుతుందో మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఇది చాలా భయంకరమైన నివేదిక అని పెస్కోవ్ తెలిపారు.

రష్యా లో ఇండియా, చైనా ల విషయంలో ఏం జరగబోతుంది ?
రెండు దేశాలూ యుద్ధాన్ని నివారించడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని, యుద్ధ నివారణతోనే ఇరుదేశాలు సురక్షితంగా ఉంటాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారుఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా పరిణామాలతో రష్యా వేదికగా భారత్ చైనాల మధ్య సయోధ్య కుదురుతుందా? లేక సమరానికి సై అంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.

ఇండియా, చైనా మధ్యలో రష్యా .. ఆసక్తికరంగా పరిణామాలు
రష్యా అటు భారత్, ఇటు చైనాల మధ్య సంప్రదింపులు జరిగేలా చూస్తోంది. రక్షణ మంత్రుల సమావేశానికి ఒక రోజు ముందు త్రై పాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ లు పాల్గొననున్నారు. ఇక రష్యా ఈ భేటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications