దారుణం : భార్యను 30 కేజీల ఇనుప చైన్తో కట్టేసి... 3 నెలలుగా చిత్రహింసలు
రాజస్తాన్లో దారుణం వెలుగుచూసింది. ఓ అనుమానపు భర్త మూడు నెలలుగా భార్యను నిర్బంధించాడు. దాదాపు 30కేజీల బరువున్న ఇనుప చైన్తో ఆమెను కట్టేశాడు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. స్థానిక అధికారుల చొరవతో ఎట్టకేలకు ఆ మహిళకు విముక్తి లభించింది.
వివరాల్లోకి వెళ్తే... రాజస్తాన్లోని ప్రతాప్గఢ్ జిల్లా లాల్గఢ్ గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత మహిళ(40) తరచూ హీంగ్లత్ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లేది. ఆమె తరచూ పుట్టింటికి వెళ్తుండటాన్ని భర్త అనుమానించాడు. ఆ గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే తరచూ అక్కడికి వెళ్లి వస్తుందని భావించాడు. దీంతో భార్యను ఇల్లు కదలకుండా చేయాలనుకున్నాడు. ఇందుకోసం 30కేజీల ఇనుప చైన్తో ఆమెను ఇంట్లోనే కట్టేశాడు. నిత్యం మానసికంగా,శారీరకంగా ఆమెను వేధిస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దయనీయ పరిస్థితిపై ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. బాధిత మహిళను కాపాడి అక్కడి నుంచి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఆమె తన తల్లికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు తరచూ పుట్టింటికి వెళ్లి వచ్చేది. అయితే వివాహేతర సంబంధం కారణంగానే ఆమె పుట్టింటికి తరచూ వెళ్తుందని భావించిన భర్త... అక్కడికి వెళ్లి మరీ ఆమెను కొట్టేవాడు. ఆమె తనను మోసం చేస్తోందని నిందించేవాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది హోళీ తర్వాత ఓరోజు భార్యను విపరీతంగా కొట్టాడు. కుమారుడు,కుటుంబ సభ్యుల సాయంతో ఆమెను చైన్తో కట్టిపడేశాడు. తనను చిత్రహింసలకు గురిచేసిన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications