రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..
నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో రాజస్తాన్లో యువ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై ధిక్కారం వినిపిస్తున్నాడు. ఇప్పటికైతే ఆయన కాంగ్రెస్ కాంపౌండ్లోనే ఉన్నప్పటికీ... తన డిమాండ్ల విషయంలో మొండిపట్టు పడుతుండటంతో.. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

రిసార్టుకు ఎమ్మెల్యేలు... శాసనసభాపక్ష సమావేశం...
ప్రభుత్వం సచిన్కు నోటీసులు పంపించడం,తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని,అశోక్ గెహ్లాట్ సర్కార్ పని అయిపోయినట్లేనని సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలతో ఈ సంక్షోభానికి తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీఎం పదవి కోసం పట్టుబట్టిన ఆయన... అప్పటినుంచి అసంతృప్తిని అణుచుకుంటూ వస్తున్నారు. తాజా పరిణామాలతో సోమవారం(జూలై 13) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ పూర్తి మద్దతు అశోక్ గెహ్లాట్కే అని ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో సచిన్ పైలట్ చెప్తున్నట్లు ప్రభుత్వం మైనారిటీలో పడిపోయే పరిస్థితేమీ లేదని స్పష్టమవుతోంది.

సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్...
సచిన్ పైలట్ క్యాంపులో ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ నలుగురికి అశోక్ గెహ్లాట్ కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వాలనేది సచిన్ డిమాండ్. అది మాత్రమే కాదు,అందులో ఇద్దరికీ హోంశాఖ,ఆర్థిక శాఖ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక పీసీసీ చీఫ్ పదవిని తిరిగి తనకే ఇవ్వాలనేది మరో ప్రధాన డిమాండ్. ఈ మూడు డిమాండ్లకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్తో తన ప్రయాణం కొనసాగుతుందని సచిన్ పైలట్ తేల్చి చెబుతున్నాడు.

వేటు వేస్తామన్న కాంగ్రెస్...
అంతకుముందు వచ్చిన కథనాల ప్రకారం... సచిన్ పైలట్ క్యాంపులో కనీసం 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాకపోతే సచిన్ పైలట్ పీసీసీ పదవిని మరో నేత రఘువీర్ మీనాతో భర్తీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు,రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తామని తెలిపాయి. సచిన్ పైలట్ను వదులుకోవడానికి నిజానికి కాంగ్రెస్ ఏమాత్రం సిద్దంగా లేదు. పైలట్కు ఇప్పటికీ,ఎప్పటికీ కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా చెప్పారు.

బలపరీక్షకు బీజేపీ డిమాండ్..
కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారన్న కథనాల నేపథ్యంలో బీజేపీ స్పందించింది. అదే నిజమైతే సీఎం గెహ్లాట్ ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్దం కావాలని ఆ పార్టీ నేత అమిత్ మాళవియ సవాల్ విసిరారు. రాజస్తాన్ను పొలిటికల్ డ్రామా నుంచి గట్టెక్కించాలంటే అదొక్కటే మార్గమన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 107 సభ్యుల బలం ఉంది.ఇందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు,ఇద్దరు వామపక్ష ఎమ్మెల్యేలు,10 మంది స్వతంత్రులు, భారతీయ ట్రైబల్ పార్టీ,రాష్ట్రీయ లోక్దళ్ తరుపున ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. అధికారాన్ని చేపట్టడానికి ఆ పార్టీకి మరో 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అటు సచిన్ పైలట్ కూడా బీజేపీతో చేతులు కలిపేది లేదని చెప్పారు. అయినప్పటికీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి... మున్ముందు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications