Rajasthan Polls: రాజస్తాన్ లో మారుమూల గ్రామాల్లోనూ పోలింగ్-తొలిసారి ఈసీ ఏర్పాట్లు..
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ నెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 200 నియోజకవర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఓటు హక్కు కల్పించేందుకు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజస్తాన్ లోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఓటు వేయడం తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కనీసం ఒక్కో చోట 30-60 ఓటర్లు కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఈసారి పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల అధికారుల్ని అక్కడికి పంపడంతో పాటు ఓటర్ల నమోదు, పోలింగ్ బూత్ ల ఏర్పాటు, ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నెల 25న ఎలాగైనా ఇక్కడి ఓటర్లతో ఓటు వేయించాలనే పట్టుదల ఈసీ అధికారుల్లో కనిపిస్తోంది.

రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో 4,921 అడుగుల ఎత్తులో ఉన్న షెర్గావ్ ఓటర్లు గతంలో పోలింగ్ కోసం ఉత్రాజ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి ఈసారి ఈసీ అటవీ గార్డుల సహాయంతో ఒక ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. వారు దట్టమైన అడవుల గుండా సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రదేశానికి చేరుకుంటారు. దీంతో అబు-పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోని షెర్గావ్ నివాసితులు తొలిసారిగా తమ సొంత గ్రామంలో ఓటు వేసేందుకు వీలు కలగనుంది.
అలాగే రాజస్తాన్ లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న బార్మర్ కా పార్ గ్రామంలో 35 మంది ఓటర్ల కోసం పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. మంఝోలి గ్రామంలో 49 మంది ఓటర్లకు వసతి కల్పిస్తూ పోలింగ్ బూత్ ఏర్పాటైంది. కంతాల్ కా పార్ గ్రామం కూడా 50 మంది ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక జనాభాకు అందుబాటులో ఉండేలా చేసింది. ఇలా ఈసీ మారుమూల ప్రాంతాల్లో తొలిసారి ఓటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు ప్రశంసలు అందుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications