వాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు: ఫ్యాన్స్కి రజినీ కీలక సూచనలు
చెన్నై: తన అభిమానులు విలువలతో జీవించాలని కోరుకుంటున్నట్లు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించారు. రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన తన అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గురువారం కూడా ఆయన అభిమానులతో భేటీ అయ్యారు.
మదురై, విరుధునగర్, నమక్కల్, సేలం జిల్లాల అభిమానులు గురువారం సమావేశంలో పాల్గొన్నారు. డిసెంబర్ 31న తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని రజినీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తులను ఆయన చేస్తున్నట్లు తెలుస్తోంది.
విలువలతో జీవించాలి..
గురువారం అభిమానులతో నిర్వహించిన సమావేశంలో రజినీ మాట్లాడుతూ.. ‘నా అభిమానులు విలువలతో జీవించాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి. వారి కాళ్లకు నమస్కరించాలి. అంతేగానీ, ఎవరి కాళ్లపై పడొద్దు' అని సూచించారు.
అభిమానులకు సూచన
‘డబ్బు, అధికారం ఉన్న వాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు' అని రజినీకాంత్ తన అభిమానులకు సూచించారు. తన కాళ్లపై కూడా పడొద్దని ఆయన సూచించారు. బుధవారం పుదుకొట్టై జిల్లాకు చెందిన రజనీగుణ అనే అభిమాని తన రెండు చేతులూ పైకి ఎత్తి జోడించి రజినీకాంత్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ నేపథ్యంలోనే రజినీ ఈ శ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
వచ్చామంటే గెలుపు మనదే
కాగా, కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో డిసెంబర్ 26 నుంచి అభిమానులతో రజినీకాంత్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మనం రాజకీయాల్లోకి వచ్చామంటే... గెలిచినట్లేనని రజినీ ఇప్పటికే వ్యాఖ్యానించడం గమనార్హం.
రజినీ ఎంట్రీపై ఉత్కంఠ
బుధవారం 800మంది అభిమానులు తమ అభిమాన హీరో రజినీకాంత్తో ఫొటోలు దిగడం గమనార్హం. తన రాజకీయ ప్రవేశంపై చివరి రోజున స్పష్టత ఇస్తానని రజినీకాంత్ చెప్పిన నేపథ్యంలో.. అభిమానులతోపాటు తమిళ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.