నా పేరు దుర్వినియోగం చేస్తున్నారు.. నేనే గనుక రాజకీయాల్లోకి వస్తే!: రజనీకాంత్
రాజకీయ నేతలు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని ఆయనఅన్నారు.
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశం ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది. అభిమానులకు ఆయన కబురు పెట్టిన ప్రతీసారి.. ఈసారి కచ్చితంగా రాజకీయ ప్రకటనే అన్న ఊహాగానాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. యథావిధిగా రజనీ మాత్రం అలాంటిదేమి లేదని తేల్చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన అభిమానులతో అవనున్నారు. రోజుకు 250మంది ఫ్యాన్స్ తో ఆయన భేటీ జరగనుంది. కార్యక్రమంలో అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు రజనీకాంత్ ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
సోమవారం ప్రారంభమైన సమావేశాల సందర్భంగా.. రాజకీయాల గురించి రజనీకాంత్ మరోసారి స్పందించారు. రాజకీయ నేతలు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని ఆయనఅన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారని, వారు అలా కోరుకోవడంలో తప్పేమి లేదని అన్నారు.
ఒకవేళ తాను రాజకీయాల్లోకి గనుక వస్తే.. డబ్బు ఆశ ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లో తన చెంత చేర్చుకోనని చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే రాజకీయాలకు దూరమని రజనీకాంత్ సంకేతాలు పంపించినా.. అభిమానులు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ధృఢ నిశ్చయంతో ఉన్నారు.