అడగలేదు: రాజీవ్ గాంధీపై బాంబు పేల్చిన నట్వర్ సింగ్
ఆయన తాజాగా మరో బాంబు పేల్చారు! 1987లో కొలంబోలో నాటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే ఇచ్చిన విందుకు రాజీవ్ హాజరయ్యారని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, సైన్యాన్ని పంపించాలని జయవర్ధనే కోరారని, ఇందుకు రాజీవ్ వెంటనే అంగీకరించారని, అధికారులు, మంత్రివర్గ సహచరుల సూచనలు, ఆమోదం తీసుకోకుండానే రాజీవ్ ఆదేశాలిచ్చారని నట్వర్ చెప్పారు. అప్పట్లో తాను, పీవీ శ్రీలంకలోనే ఉన్నామన్నారు.
ఈ విషయం తమకు తెలిసేటప్పటికే శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. నాడు తమిళ టైగర్ల ఆధీనంలోని జాఫ్నాలో విమానాల్లోంచి ఆహార పొట్లాలు జారవిడవడం పైనా రాజీవ్ ఆషామాషీగా నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రీలంక ప్రభుత్వంతోపాటు ఐరాసలోని మన రాయబారికి సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అలా చేయకపోతే శ్రీలంక గగనతలంపై దాడికి దిగినట్టయ్యేందన్నారు.
అప్పట్లో భద్రతామండలిలో సభ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ అంశంపై రచ్చ చేసేదే అన్నారు. దీనిపై తాను ముందుగా హెచ్చరించడంతో ఈ ప్రమాదం తప్పిందన్నారు. ప్రభాకరన్ను రాజీవ్ గుడ్డిగా నమ్మేశారన్నారు. ప్రభాకరన్ను కలిసి వచ్చాక... ఆయా అంశాలపై ఎల్టీటీఈ చీఫ్ నుంచి లిఖితపూర్వక హామీలు తీసుకున్నారా? అని రాజీవ్ను తాను అడిగానని, దీంతో రాజీవ్ కస్సుమన్నారన్నారు. ప్రభాకరన్ మాట ఇచ్చారని తెలిపారు. కానీ... భారత ప్రధాని సహా అనేకమందికి ఇచ్చిన మాటను ప్రభాకరన్ తప్పారన్నారు.