ఏ బాంబ్ వచ్చిపడుతోందని భయం: వెయ్యి గ్రామాలు ఖాళీ, భద్రత పెంచిన భారత్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి దేశ అంతర్గత భద్రతపై శుక్రవారం సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి హోం శాఖ సహాయ మంత్రి కిరిజ్ రిజిజు, బోర్డర్ సెక్యూరిటీ ఛీఫ్, త్రివిధ దళాలధిపతులతో పాటు డీజీఎంఓ కూడా హాజరు కానున్నారు.
ఈ భేటీలో అన్ని విభాగాలు సమన్వయ పరుచుకుంటూ, పరిస్థితులను ఎదుర్కునేందుకు రాజ్నాథ్ సింగ్ పలు సూచనలు చేయనున్నారు. సరిహద్దులోకి భద్రతా దళాల తరలింపు వాటిపై కూడా చర్చించనున్నారు. ఇప్పటివరకు సరిహద్దుల్లో తీసుకున్న చర్యలను రాజ్నాథ్ సింగ్కి ఆర్మీ అధికారులు వివరించనున్నట్లు తెలుస్తోంది.

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
మరోవైపు గురువారం సాయంత్రం అఖిల పక్షంలో తీసుకున్న నిర్ణయాలను కూడా రాజ్నాథ్ సింగ్ ఆర్మీ అధికారులకు వివరించనున్నారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాజ్నాథ్ ఇప్పటికే సూచించారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 12 గంటల ప్రాంతంలో కేబినెట్ భద్రతా వ్యవహారాల సంఘం సమావేశం కానుంది.

ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న మోడీ
భారత సైన్యం నుంచి మోడీ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పాక్ నుంచి దాడులు జరగవచ్చని భారత్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పంజాబ్లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాళీ చేయించింది.ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి మీద పడుతుందోనన్న భయంతో ప్రజలు ఉన్నారు.

పరిణామాలపై రాజ్నాథ్ సింగ్ సమీక్ష
సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై, ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు. మొత్తం వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తోన్న భారత సైనికులు అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో సైనిక శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు.

గురుద్వారలో సైనికుల శిబిరాలు
పంజాబ్లో గురుద్వారలోనూ సైనికుల శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రజలంతా తట్టా బుట్టూ సర్దుకుని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఏ క్షణాన్నైనా స్వల్పకాలిక యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పాక్ దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. హై అలర్ట్ కొనసాగుతోంది.

విమానాలు గస్తీ, అప్రమత్తమైన నేవీ
ఎయిర్ఫోర్స్ విమానాలు గస్తీ కాస్తున్నాయి. అరేబియా సముద్ర తీరంలో నేవీ అప్రమత్తమైంది. కదనరంగంవైపు భద్రతా దశాలు అడుగులు వేస్తున్నాయి. ఏ క్షణమైనా ఎటాక్ చేసేందుకు భారత్ సర్వం సిద్ధం చేసింది.












Click it and Unblock the Notifications