ఢిల్లీ ఎన్సీటీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఆప్ తీవ్ర అభ్యంతరం, కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్య అధికార బీజేపీ ఈ బిల్లు నెగ్గించుకుంది.
ఢిల్లీ ప్రభుత్వం అంటే ఇక లెఫ్టినెంట్ గవర్నర్ అని నిర్వచించే 'ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ) బిల్లు 2021'కు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. కాగా, ఈ బిల్లుకు ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేటికైనా ఎల్జీ ఆమోదం తప్పనిసరి.

కాగా, బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.
మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ రాజ్యాంగానికి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రజలను అవమానించడమేనని అన్నారు. కాగా, పాలన పరమైన వ్యవహారాల్లో అస్పష్టతను తొలగించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని కేంద్రం పేర్కొంది. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని తెలిపింది.












Click it and Unblock the Notifications