భారత్ బంద్ విజయవంతం: ధన్వవాదాలు తెలిపిన రాకేష్ టికాయత్, గుండెపోటుతో ఓ రైతు మృతి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం(సెప్టెంబర్ 27) భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన బంద్ సందర్భంగా అనేక జాతీయ, రాష్ట్ర రహదారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అనేక మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. బంద్ ప్రభావం రైళ్ళపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేశారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దు కూడా 10 గంటలపాటు మూసి వేశారు. బంద్ ముగిసిన తర్వాత తెరిచారు. కాగా, పెద్ద సంఖ్యలో రైతులు నోయిడా అథారిటీ సమీపంలో గుమిగూడి పోలీసు బారికేడింగ్ను బద్దలుకొట్టారు. ఆ తర్వాత నోయిడా అథారిటీ వైపు దూసుకెళ్లారు.
కాంగ్రెస్, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు మద్దతు ఇచ్చాయి. బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) నుంచి కూడా మద్దతు లభించింది. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్కు మద్దతు పలికిన రైతులు, కార్మికులు, రాజకీయ పార్టీలకు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ భారత్ బంద్కు ఇంత మద్దతు లభించలేదని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. 25కి పైగా రాష్ట్రాలలో బంద్ విజయవంతమైందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్యుపష్టం చేశారు. అదే సమయంలో, రైతులు ఆందోళనను విరమించి, చర్చల మార్గాన్ని అవలంబించాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
కాగా, పంజాబ్లో భారత్ బంద్ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది. పంజాబ్లోని లూథియానాలోని లాడోవల్ టోల్ ప్లాజా, ఎంబీడీ మాల్ ఫిరోజ్పూర్ రోడ్ వద్ద నిరంతరం సిట్-ఇన్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ రోడ్డు మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటి నుంచి పనిచేశారు. చాలా పాఠశాలలు పరీక్షలను వాయిదా వేశాయి. రైతులకు మద్దతుగా టాక్సీ సేవలు కూడా నిలిపివేశారు.
నిరసనలో గుండెపోటుతో రైతు మృతి
భారత్ బంద్ పూర్తిగా విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. ఇప్పుడు యునైటెడ్ కిసాన్ మోర్చా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోందన్నారు. కాగా, నిరసన ప్రదర్శన సమయంలో ఢిల్లీ-సింఘూ సరిహద్దులో ఒక రైతు మరణించాడు. అతను గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. మరణించిన రైతును భాగెల్ రామ్గా గుర్తించారు.