హైదరాబాద్లో దక్షిణాఫ్రికా విద్యార్థినులపై రేప్ యత్నం
హైదరాబాద్: హైదరాబాదులో దారుణం జరిగింది. ఇద్దరు దక్షిణాఫ్రికా విద్యార్థినులపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు! ద్విచక్ర వాహనం పైన వచ్చి ఓ వ్యక్తి తమపై అత్యాచారయత్నం చేశాడని బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
దక్షిణాఫ్రికా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ఒక యువకుడు గత కొంతకాలంగా బైకు పైన వెంటబడి, వేధిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాను బంజారాహిల్స్ నుండి టోలీచౌకి వెళ్తుండగా తన పైన అత్యాచారయత్నం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాధితురాలు బైక్ నెంబర్ కూడా ఇచ్చింది.
విద్యార్థినికి లైంగిక వేధింపులు
హైదరాబాదులోని ఓ పాఠశాలలో సోమవారం దారుణం వెలుగు చూసింది. గాయత్రినగర్లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని పైన శ్రీనివాస్ అనే టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంట పొలాలపై ఏనుగుల దాడి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ సింగాపురం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన మునిరాజు అనే రైతు సాగు చేసిన అరటి, వరి పంటలతో పాటు కొబ్బరి చెట్లను ఏనుగులు దాడి చేసి నష్టపరిచాయి.
ఆటో-ట్రాక్టర్ ఢీ
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం మండలం తంగెళ్లగూడెంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. ఆటో-ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి : ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోని మైదార్దేవ్పల్లి బుద్వేల్ రైల్వేట్రాక్ దగ్గర ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
సాంకేతికలోపంతో నిలిచిన గూడ్స్ రైలు
కర్నూలుజిల్లాలోని పాణ్యం మండలం నెరవాడ సమీపంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.