ఒంటరి యువతిపై అత్యాచారం: 5 షూ దెబ్బలతో సరిపుచ్చారు
హర్యానా: హర్యానా రాష్ట్రంలో ఓ రేపిస్ట్కు స్థానిక పంచాయతీ ఐదు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పి వదిలేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటన యమునానగర్ జిల్లా భగవాన్పూర్ పంచాయతీ పరిధిలో జరిగింది. ఇది మార్చి 25వ తేదీన జరిగింది.
19 ఏళ్ల బాధితురాలు గడ్డి తీసుకు వచ్చేందుకు తమ పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల వ్యక్తి ఆమె పైన అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గ్రామ పెద్ద వరకు వెళ్లింది.
ఇరువర్గాలతో కలిసి పంచాయతీ చేసిన పెద్దలు... నిందితుడైన వ్యక్తికి ఐదు షూ దెబ్బలు శిక్షగా వేయాలని నిర్ణయించారు. మరో విషయమేమంటే.. పంచాయతీ పెద్దలు ఈ తీర్పు చెప్పిన సమయంలో కొందరు పోలీసులు అక్కడే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
పోలీసులు మాత్రం తీర్పు సమయంలో పోలీసులు ఎవరు కూడా అక్కడ లేరని చెబుతున్నారు. దీనిపై గ్రామానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ... అది అత్యాచారం కేసో లేదా గొడవ కేసో తనకు తెలియదని, కానీ నిందితుడికి బూటు (షూ) దెబ్బలు శిక్షగా వేశారని చెప్పాడు. బుధవారం నాడు స్టేట్ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు సుమన్ దహియా బాధితురాలి కుటుంబాన్ని కలుసుకున్నారు.