రసం వడ్డించలేదని వెళ్లిపోయిన వరుడు
బెంగళూరు: భోజనంలో రసం వడ్డించలేదని తెల్లారితే పెళ్లి పెట్టుకుని పెళ్లి కొడుకు ఆవేశంతో కళ్యాణమండపం నుంచి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ పట్టణంలో జరిగింది.
పెళ్లి ఆగిపోయిందని వధువు కుటుంబ సభ్యులు విలపిస్తున్న సమయంలో ఓ యువకుడు తాను పెళ్లాడతానంటూ ముందుకురావడంతో అదే ముహూర్తానికి ప్రశాంతంగా పెళ్లి జరిగింది. రసం వడ్డించలేదని వెళ్లి పోయిన వరుడు, అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
కుణిగల్ కు చెందిన ప్రకాష్, సౌభాగ్యమ్మ కుమార్తె సౌమ్య, శ్రీరామపురంకు చెందిన తిమ్మయ్య, గౌరమ్మల కుమారుడు రాజుల వివాహం ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. వరుడి కుటుంబ సభ్యులు శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో కళ్యాణమంటపం చేరుకున్నారు.
ఆలస్యంగా వారు కళ్యాణమంటపం చేరుకున్నారు. తరువాత భోజనం వడ్డించాలంటూ వరుడు, అతని తల్లి, కుమార్తెలు భోజనానికి కుర్చున్నారు. తరువాత రసం వడ్డించాలని చెప్పారు. రసం అయిపోయిందని వడ్డించేవారు చెప్పడంతో వరుడి తల్లికి మండిపోయింది.
వధువు సౌమ్య కుటుంబ సభ్యులను దూషించడం మొదలు పెట్టారు. వధువు కుటుంబ సభ్యులు ఎంత నచ్చ చెప్పినా వారు వినలేదు. తరువాత పెద్దలు సర్ది చెప్పారు. అయితే ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో వరుడు, అతని కుటుంబ సభ్యులు కళ్యాణమంటపం నుంచి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న వధువు సౌమ్య కుటుంబ సభ్యులు విలపించారు. అదే సమయంలో గోవిందరాజు అనే వ్యక్తి వధువు కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాడు. మీరు అంగీకరిస్తే తాను సౌమ్యాను వివాహం చేసుకుంటానని చెప్పాడు.
పెద్దలందరూ అంగీకరించడంతో అదే ముహూర్తానికి గోవిందరాజు, సౌమ్యల వివాహం జరిగింది. సౌమ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కుణిగల్ పోలీసులు రాజు కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.