మతిపోయిందేమో: బెంగాల్ మంత్రి, కోపమెందుకో: టాటా
కోల్కతా/న్యూఢిల్లీ: రతన్ టాటా పైన పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మండిపడ్డారు. ఆయనకు మతిపోయిందేమోనని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ధి అంశం పైన రతన్ టాటాకు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్కు మధ్య వాగ్యుద్దం సాగింది.
పశ్చిమ బెంగాల్లో పారిశ్రామికాభివృద్ధి లోపించిందని రతన్ టాటా అన్నారు. దీనిపై మిత్రా ఘాటుగా స్పందించారు. టాటాకు వయస్సు మీద పడుతోందని, ఆయన చిత్తభ్రమకు లోనవుతూ ఉండి ఉండవచ్చునని, రాష్ట్రంలో చోటు చేసుకున్న పురోగతిని ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదని అమిత్ అన్నారు.
టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ బెంగాల్లో అదనంగా ఇరవై వేల ఉద్యోగాలను ఇస్తోందని, అనీల్ అంబానీ గ్రూపు, ఇమామీ ఇక్కడ సిమెంటు కర్మాగారాలను నెలకొల్పతున్నాయని, ఇటీవలే టాటా గ్రూపులోని మరో కంపెనీ టాటా మెటాలిక్స్ ఇక్కడ ఉన్న తమ కర్మాగారాన్ని విస్తరించే ఆలోచన ఉందని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాసిందని, టాటాకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు.

లేదా ఆయన కార్యాలయం వారు ఆయనకు తాజా సమాచారం అందించడం లేదా అన్నారు. ఆయనకు విమానాలు నడిపే అలవాటు ఉందని, ఆయనను అలాగే ఎగరనివ్వండన్నారు. కాగా, టాటా సర్టిఫికేట్ తమకు అవసరం లేదని మరో మంత్రి ఫర్హద్ హకీమ్ మండిపడ్డారు.
అమిత్ వ్యాఖ్యల పైన టాటా స్పందించారు. ఆయన అంత కోపాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదని, విమానాశ్రయం నుండి రాజర్హట్ మీదుగా నగరానికి చేరుకునేటప్పుడు తనకు చాలా వరకు నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలే కనిపించాయి తప్ప, పరిశ్రమల అభివృద్ధి చెందిన దాఖలాలు పెద్దగా కనబడలేదని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని గురించి తానేమి అనలేదని, అందుకే మిత్రా వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ట్వీట్ చేశారు.
తాను మతి పోగొట్టుకున్నానన్నది మిత్రా అభిప్రాయం కావొచ్చునని, రాజర్హట్ గుంటూ వచ్చినప్పుడు తాను చూడలేకపోయిన పారిశ్రామిక అభివృద్ధి పథకాలు ఏమేం ఉన్నాయో ఆయన తనకు చూపెడితే సంతోషిస్తానని, ఆ పని చేయలేదంటే, ఆయన ఊహల్లో మునిగి తేలుతున్నారని తాను తీర్మానించుకోవలసి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications