భారత్ కు మళ్ళీ కాస్త రిలీఫ్ .. 35 వేల కరోనా కొత్త కేసులు, 500 దిగువకు మరణాలు
భారతదేశంలో కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఒకపక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తుంది. ఒకపక్క డెల్టా వేరియంట్ కేసులు పెరగటం కూడా భవిష్యత్ పై ఆందోళనకు కారణంగా మారింది. ఇక తాజాగా దేశంలో కరోనా పరిస్థితిని చూస్తే రోజువారీ కొత్త కేసులు, మరణాలు కాస్త తక్కువగా నమోదయినట్లు గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
గత 24 గంటల్లో 35,342 కరోనా కొత్త కేసులు నమోదు కాగా భారతదేశం శుక్రవారం స్వల్పంగా కరోనా కేసులలో క్షీణత చూసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. నిన్నటి కంటే 14.5 శాతం తక్కువ కేసులను నేడు నమోదు చేసింది. గత 24 గంటల్లో 483 మరణాలను నమోదు చేయగా, దీంతో భారతదేశంలో రోజువారీ మరణాలు ఇప్పటివరకూ మొత్తం 4,19,470 నమోదు అయినట్లుగా తెలుస్తోంది.భారతదేశంలో మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.
కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసులు కూడా 3,881 పెరిగాయి . దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 405,513 కు చేరుకున్నాయి. భారతదేశం నమోదు చేసిన మొత్తం కేసులలో 1.31% యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 38,740 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,04,68,079 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 42 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 54.26 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
దేశంలో ఇప్పటివరకు 45,374 మ్యూకోర్ మైకోసిస్ లేదా "బ్లాక్ ఫంగస్" కేసులు నమోదయ్యాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా 4,332 మంది రోగులు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారతదేశ రోజువారీ కేసుల్లో కేరళ 12,818 కేసులను నమోదు చేసింది. దక్షిణాది రాష్ట్రం అయిన కేరళలో దోమల ద్వారా సంభవించే జికా వైరస్ కేసులు 44 నమోదయ్యాయి.