కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులు
భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఐసీఎంఆర్ కూడా కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే ప్లాస్మా థెరపీని కోవిడ్ చికిత్స విధానం నుంచి తొలగించిన ఐసీఎంఆర్ ఆ తర్వాత మరో కీలక డ్రగ్ రెమ్డెసివిర్ను కూడా ఉపసంహరించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ గంగారాం ఆస్పత్రి ఛైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా వ్యాఖ్యలే ఇందుకు కారణం.
కరోనా చికిత్సలో పెను మార్పులు
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ సోకిన వారికి అందిస్తున్న చికిత్స విధానంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ అందిస్తున్న చికిత్సలో మార్పులు చేర్పులు చేయకపోతే వైరస్ నియంత్రణ సాధ్యం కాదని భావిస్తున్న నిపుణులు.. పలుమార్పులు సూచిస్తున్నారు. ఐసీఎంఆర్కు చెందిన కోవిడ్ జాతీయ టాస్క్ఫోర్స్తో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖలోని నిపుణులు కూడా సంయుక్తంగా వీటిపై సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న చికిత్సా విధానాల్లో మార్పులు చేయడం ద్వారా వైరస్ను మరింత సమర్దంగా ఎదుర్కొనే కొత్త విధానాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్లాస్మాథెరపీ విధానం రద్దు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఎందరో కరోనా వైరస్ రోగుల ప్రాణాలు కాపాడిందని భావిస్తున్న ప్లాస్మా థెరపీ విధానాన్ని తాజాగా ఐసీఎంఆర్ తమ లిస్ట్లో నుంచి ఉపసంహరించుకుంది. ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నట్లు ఐసీఎంఆర్ భావించడమే ఇందుకు కారణం. ప్లాస్మా థెరపీ వల్ల కొత్త కొత్త కరోనా వైరస్ రకాలు రోగుల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందున ఇకపై ప్లాస్మా థెరపీ వాడొద్దని ఐసీఎంఆర్ తమ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
రెమ్డెసివిర్కూ రాం రాం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా చికిత్సలో కీలకంగా పనిచేస్తుందని భావిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను కూడా త్వరలో ఉపసంహరించుకునేందుకు ఐసీఎంఆర్ సిద్దమవుతోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ప్రఖ్యాత గంగారాం ఆస్పత్రి ఛైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా వెల్లడించారు. ప్లాస్మా థెరపీయే కాదు రెమ్డేసివిరే కాదు చికిత్సలో ప్రభావం చూపని ఏ డ్రగ్ను అయినా, విధానాన్ని అయినా ఉపసంహరించుకోక తప్పదంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కోవిడ్ రోగులపై రెమ్డెసివిర్ ప్రభావం ఏమాత్రం లేదని ఆయన చెప్తున్నారు.
రెమ్డెసివిర్కు కాలం చెల్లిందా ?
ప్రస్తుతం కోవిడ్ రోగులకు సంజీవనిగా డాక్టర్లు భావిస్తున్న రెమ్డెసివిర్ కూడా మ్యాజిక్ బుల్లెట్ ఏమీ కాదని తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ రణ్దీప్ గులేరియా వ్యాఖ్యానించారు. రెమ్డెసివిర్పై అంతగా ఆధారపడటం కూడా మంచిది కాదన్నారు. రెమ్డెసివిర్ను వైరస్ సోకక ముందు కానీ, సోకిన చాలా రోజుల తర్వాత కానీ ఇవ్వడం ప్రమాదకరమని కూడా గులేరియా తెలిపారు. దీంతో రెమ్డెసివిర్పై ఉన్న భ్రమలు తొలగిపోయినట్లైంది. ప్రఖ్యాత డాక్టర్లు, కోవిడ్ టాస్క్ఫోర్స్లో భాగంగా ఉన్న గులేరియా, డీఎస్ రాణా వ్యాఖ్యలతో రెమ్డెసివిర్కు కాలం చెల్లిందనే వాదన మొదలైంది.