ఈవీఎంలు ఉండవిక: రిమోట్లతో ఓటింగ్..ఇంటర్నెట్ పోలింగ్ బూత్: 2024 లోక్సభ ఎన్నికలకు రెడీ
న్యూఢిల్లీ: ఇదివరకు బ్యాలెట్ల పద్ధతిన ఓట్లను వినియోగించుకోవడాన్ని చూశాం. దాని తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలొచ్చాయి. ఇప్పుడవి కూడా కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో రిమోట్లు రానున్నాయి. రిమోట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సరికొత్త విధానం దేశంలో అందుబాటులోకి రానుంది. 2024 సాధారణ ఎన్నికల్లోగా రిమోట్తో ఓటు వేసే వేసే వ్యవస్థను ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం పరిశీలిస్తోంది. దీనికి అవసరమైన పైలెట్ ప్రాజెక్ట్ను మరో రెండు మూడు నెలల్లో ఆరంభించనుంది.
ఎక్కడి నుంచైనా ఓటు..
ఓటర్లు తమ ఓటు హక్కును ఎక్కడి నుంచైన వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. రిమోట్ ఓటింగ్ వ్యవస్థపై ఐఐటీ-మద్రాస్, ఇతర ఐఐటీ టెక్నోక్రాట్లు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఆ ఓటింగ్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టు కింద రెండు మూడు నెలల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉండాల విషయంపై కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇంట్లో నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించాలనేది దీని ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
ఈస్టోనియాలో మొదటిసారిగా..
ఆన్లైన్ ద్వారా ఓటు వేసే విధానాన్ని తొలిసారిగా ఈస్టోనియాలో అందుబాటులోకి వచ్చిందని, అదే విధానాన్ని మన దేశ వనరులు, సాంకేతిక పరిజ్ఙానం, ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సునీల్ అరోరా చెప్పారు. ఇంటర్నెట్ను వినియోగించుకుని ఓటు వేసే విధానం స్విట్జర్లాండ్, అస్ట్రేలియా, నెదర్లాండ్స్.. వంటి ఇలా పలు దేశాల్లో అమల్లో ఉందని చెప్పారు. భద్రతా కారణాల వల్ల కొన్ని దేశాలు ఈ వ్యవస్థను ఉపసంహరించుకున్నాయని పేర్కొన్నారు. ఆ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం ద్వారా లోపాలను అరికట్టొచ్చని చెప్పారు.
సొంతంగా ఇంటర్నెట్ లైన్స్..
ఈ విధానంలో పారదర్శకతను పాటించడానికి సొంతంగా ఇంటర్నెట్ లైన్స్ను ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోలేదని సునీల్ అరోరా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ బూత్ స్థానంలో.. ఇంటర్నెట్ పోలింగ్ బూత్ తరహా వ్యవస్థ అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. ఐపీ డివైజెస్, టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, సొంతంగా ఇంటర్నెట్ లైన్స్, బయో మెట్రిక్, వెబ్ కెమెరా వంటి సౌకర్యాలు ఇంటర్నెట్ పోలింగ్ బూత్లో ఉండేలా ప్రతిపాదనలను రూపొందించామని, వాటన్నింటినీ అనుసంధానించే సమగ్ర సాంకేతిక పరిజ్ఙానాన్ని ఐఐటీ నిపుణులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.