రాజ్యసభలో చానళ్ల బ్యాన్: రేణుక వాగ్వాదం, కేకేకు షాక్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేశారని పఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభ దృష్టికి గురువారం తీసుకువెళ్లారు. ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.
కోర్టు ఆదేశాలు ఇచ్చినా, కేంద్రం నోటీసు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రేణుక ప్రసంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు కే కేశవ రావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమంటూ రేణుకతో కేకే వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ ప్రసారమాధ్యమాలను అడ్డుకోవడం రాష్ట్ర వ్యవహారం ఎలా అవుతుందని కేకేను ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు సంబంధించిన అంశమే అని, దీన్ని రాజ్యసభలో లేవనెత్తడంలో తప్పులేదని కురియన్ అన్నారు.