విశ్రాంత భద్రతాధికారుల్నీ వదలని మోడీ సర్కార్- పనిచేసిన సంస్ధల్ని విమర్శిస్తే పెన్షన్ కట్
దేశవ్యాప్తంగా తమ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించే చర్యల్లో భాగంగా మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రాతల్ని నిరోధించేందుకు ఐటీ చట్టాల్ని సవరించిన కేంద్రం.. ఇప్పుడు గతంలో భద్రతా సంస్ధలు, ఇంటెలిజెన్స్లో పనిచేసి రిటైరైన అధికారుల్ని కట్టడి చేసేందుకు పెన్షన్ రూల్స్ను సవరించింది.
జాతీయ స్ధాయి భద్రతా సంస్ధల్లో గతంలో పనిచేసి రిటైరైన అధికారులు ఇకపై తాము పనిచేసిన సంస్ధలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలన్నా, వ్యాసాలు, కథనాలు రాయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి చేశారు. ఈ మేరకు కేంద్ర సివిల్ సర్వీస్ చట్టం 1972లోని పెన్షన్ నిబంధనల్లో సవరణలు చేశారు. కేంద్రం అనుమతి తీసుకోకుండా తాము గతంలో పనిచేసిన సంస్ధలకు వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా సదరు అధికారుల పెన్షన్పై ప్రభావం పడబోతోంది.
వాస్తవానికి 2008 నాటి సవరణలోనే భద్రతా సంస్ధల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ సంస్ధలకు సంబంధించిన సున్నిత, రహస్య సమాచారాన్ని బయటపెట్టరాదని ఆంక్షలు విధించారు. దేశ సమగ్రతకూ, సార్వభౌమత్వానికీ భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అందులో నిబంధనలు పెట్టారు. తాజాగా ఈ సవరణను మోడీ సర్కార్ మరింత సవరించి దీని పరిధి పెంచింది. తాజా సవరణ ప్రకారం సంస్ధపై ఎలాంటి రాతలు రాయాలన్నా భద్రతా సంస్ధల విశ్రాంత ఉద్యోగులు సదరు సంస్ధ ప్రస్తుత విభాగాధిపతి అనుమతి తీసుకోవాల్సిందేనని నిబంధన పెట్టారు.
మోడీ సర్కార్ నిర్ణయంపై రిటైర్డ్ భద్రతాధికారులు మండిపడుతున్నారు. కేంద్రాన్ని విమర్శించే వారిని కట్టడిచేసేందుకే ఈ సవరణ తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సవరణ ప్రకారం మొత్తం 18 భద్రతా సంస్ధల విశ్రాంత ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తున్నారు. ఇందులో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్ఎస్ఏ, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, ప్రత్యేక సరిహద్దు దళం, లక్షద్వీప్ పోలీసు వంటి సంస్ధలున్నాయి.