అదీ 'అమ్మ' అంటే: పూలవర్షం, జయలలితకే ఆశ్చర్యం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం నాడు తన సొంత నియోజకవర్గమైన ఆర్కేనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆమెకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు.
భారీ భద్రత మధ్య ఆమె ఆర్కే నగర్లో విజయయాత్ర నిర్వహించారు. యాత్రలో రోడ్డుకు ఇరువైపులా వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు బారులు తీరి ఆమెకు స్వాగతం పలికారు. ప్రతి చోటా ఆమె పైన ప్రజలు పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పలు ప్రాంతాల్లో ఆమె ప్రయాణిస్తున్న వ్యానను బలవంతంగా నిలిపేసిన పార్టీ కార్యకర్తలు, మహిళలు కొబ్బరికాయలతో, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు పట్టారు. వెల్లువలా జయ వాహనం వైపు దూసుకువస్తున్న కార్యకర్తలను అదుపుచేయడం సెక్యూరిటికీ తలకుమించి భారమైంది.
దారిపొడవునా కార్యకర్తలు అన్నాడీఎంకే పార్టీ పతాకాలు, రెండాకుల గుర్తు ప్లాస్టిక్ బొమ్మలను చేతపట్టుకుని జయలలిత వాహనం కేసి ఊపుతూ అమ్మ వర్థిల్లాలి అమ్మవర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో చండీమేళం, బ్యాండ్ మేళం, మంగళవాయిద్యాలతో పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు.

పార్టీ కార్యకర్తలు అందించిన పుష్పగుచ్ఛాలను జయ తన వ్యాన కిటికీ అద్దాలు దించి మరీ స్వీకరించారు. తనను దగ్గరగా చూడాలని ప్రయత్నిస్తున్న కార్యకర్తల ఆరాటాన్ని గమనించిన జయ పలు ప్రాంతాల వద్ద తన వాహనాన్ని వారికి చేరువగా నడుపమని డ్రైవర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఓ చోట దిడీర్నగర్కు చెందిన జాలరి దంపతులందించిన వారి పసిబిడ్డను జయలలిత చేతుల్లోకి తీసుకొని పసికందు నుదుటిని ముద్దాడి ఆ బిడ్డకు అపర్ణ అని పేరు పెట్టారు. అంతేగాక ఆ పసిబిడ్డ చేతికి డబ్బులను కానుకగా ఇచ్చారు. ఓ చోట రెండు చేతుల్లో పెద్ద గుమ్మడికాయను మోయలేక మోస్తూ వచ్చిన మహిళను చూసి జయ విస్తుపోయారు.
దారిపొడవునా తనకు స్వాగతం చెబుతున్న కార్యకర్తల ఉత్సాహం, ఉత్తేజం, ఉద్వేగాన్ని చూసి తానెంతో ఆనందిస్తున్నానని చెప్పారు. ఆరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా తనను ఆర్కేనగర్ ఓటర్లు గెలిపించారని, వారి రుణం తాను తీర్చుకోలేనిది అన్నారు. మీరు అందించిన విజయం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఆర్కే నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications