మారని సీన్: రాజ్యసభలో కెవిపి సమైక్య ప్లకార్డు
న్యూఢిల్లీ: తిరిగి సమావేశమైన తర్వాత కూడా పార్లమెంటు ఉభయ సభల్లో పరిస్థితిలో మార్పు రాలేదు. 12 గంటల వరకు వాయిదా పడిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు తిరిగి సమావేశమయ్యాయి. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్య నినాదాలతో ఆందోళనకు దిగారు. రాజ్యసభలో కెవిపి రామచందర్ రావుతో పాటు ఇతర పార్లమెంటు సభ్యులు సమైక్య ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వారికి తోడు తమిళనాడుకు చెందిన సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. కెవిపితో పాటు తెలుగుదేశం సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితరులు ఆందోళనకు దిగారు.
లోకసభ నేరుగా రేపటికి (బుధవారానికి) వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర ప్లకార్డులు ధరించి స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. గందరగోళం మధ్యనే స్పీకర్ సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు.
కేంద్ర ప్రభుత్వంపై కొనకళ్ల నారాయణ, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని, సభ అదుపులో లేనందున వాటిని చేపట్టలేకపోతున్నానని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సభా నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.
అంతకు ముందు - రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. లోకసభ ప్రారంభమైన వెంటనే పార్లమెంటు సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.