చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్: నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని పాట గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డును దక్కించుకుంది. ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించినట్లయింది.
ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాటకు ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని దిబెవర్లీ హెల్డన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు.
నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రకటించగానే.. ఎన్టీఆర్, రాజమౌళి, రాంచరణ్.. చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. దీంతో ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అంతేగాక, భారత సినీ పరిశ్రమకు కూడా ఈ అవార్డు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినట్లయింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అవార్డు తీసుకున్న సందర్బంగా కీరవాణి మాట్లాడారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023
pic.twitter.com/v4HENSpNN7
గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కీరవాణి. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించిన హెచ్ఎఫ్పీఏకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంతోష సమయాన్ని తన సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి అని అన్నారు. పాటలో భాగస్వాములైన రాహుల్ సిప్లిగంజ్ ధన్యవాదాలు తెలిపారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నట్లు చెప్పారు. ఈ పాట విషయంలో తన కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించినట్లు కీరవాణి చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్-రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధులు కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజులను ఉద్దేశిస్తూ కల్పిత కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మనదేశంలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలను ఈ చిత్రం అందుకుంది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.