రూ. 2000 కోట్లు చేతులు మారాయి: శివసేన గుర్తు కోల్పోవడంపై సంజయ్ రౌత్ సంచలనం
శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణంను కోల్పోవడంపై తీవ్రంగా స్పందించారు.
ముంబై: శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణంను కోల్పోవడంపై తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అన్యాయమని అన్నారు. తమ పార్టీ, విల్లు-బాణం గుర్తును కొనుగోలు చేసేందుకు భారీగా డీల్ చేశారన్నారు. ఇదో ఒప్పందం అని, దీని కోసం ఏకంగా ఆరు నెలల్లో రూ. 2000
కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సంచలన ఆరోపణలు చేశారు.
అంతేగాక, ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను వెల్లడించారని, త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు, ఎంపీలకు రూ. 100 కోట్లు, తమ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించి పార్టీ మారేలా చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు.

ఇప్పుడు తమ పార్టీని, చిహ్నాన్ని తీసుకోవడానికి ఎంత చెల్లించి ఉంటారో అంచనా వేయండి? అని రౌత్ ప్రశ్నించారు. కాగా, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణంను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రహోంమంత్రి అమిత్ షా సత్యమేవ జయతే అని వ్యాఖ్యానించారు.
అమిత్ షా చెప్పేదాన్ని తాము సీరియస్ గా తీసుకోలేదన్న సంజయ్ రౌత్.. న్యాయం, సత్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తుల గురించి మనం ఏం చెప్పగలమని అన్నారు. మహారాష్ట్రలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారనే విషయం సమయం వచ్చినప్పుడు చెబుతామని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాగా, సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలపై మండిపడిన షిండే వర్గం.. ఆయన ఆరోపణలు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications