గుజరాత్ తీరంలో రూ.350 కోట్ల డ్రగ్స్ సీజ్- పాకిస్తాన్ బోటు నుంచి కోస్ట్ గార్డ్ స్వాధీనం
గుజరాత్ తీరంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికిన ఘటన మర్చిపోక ముందే మరోమారు ఇదే తరహాలో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ లభ్యమైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ బోటులో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్ ను గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ జాయింట్ ఆపరేషన్ తో పట్టుకున్నాయి.
గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం, భారతీయ కోస్ట్ గార్డ్ అరేబియా సముద్ర తీరంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో ఓ పాకిస్తాన్ పడవ దొరికింది. ఇందులో అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం ₹ 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బోటులో ఉన్న ఆరుగురు సిబ్బందిని కూడా పట్టుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గుజరాత్ తీరంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ బృందాలు ఆరుగురు సిబ్బందితో ఉన్న పాకిస్తాన్ బోట్ అల్ సకర్ను అడ్డగించాయి. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఇందులో 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన సంకేతాలు రావడంతో పక్కా ప్రణాళికతో వీటిని ఏటీఎస్, కోస్ట్ గార్డ్ పట్టుకున్నాయి. ఈ బోటులో దొరికిన ఆరుగురిని ప్రస్తుతం విచారిస్తున్నారు. విచారణలో లభించే ఆధారాలతో పాకిస్తాన్ లింకులపై ఆరా తీయొచ్చని భావిస్తున్నారు.