జాతి వ్యతిరేక శక్తులతో ఇన్ఫోసిస్ కుమ్మక్కు-ఆరెస్సెస్ పాంచజన్య షాకింగ్-ప్రకంపనలతో వెనక్కి
దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఎస్టీ, ఐటీ వెబ్ సైట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందుకు గల కారణాల్ని తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. అయితే ఇన్ఫోసిస్ ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందంటూ ఆరెసెస్స్ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆరెస్సెస్ క్లారిటీ ఇచ్చింది.
జీఎస్టీ, ఐటీ పోర్టళ్లలో సమస్య
దేశంలో గత కొన్ని రోజులుగా జీఎస్టీ, ఐటీ శాఖలకు సంబంధించి వెబ్ సైట్లు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో లక్షల కొద్దీ రిటర్న్ దాఖలులో యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీటిని నిర్వహిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పై ఒత్తిడి పెరుగుతోంది. సాంకేతిక సమస్య కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించిన ఇన్ఫోసిస్ వీటిని సవరించే పనిలో బిజీగా ఉంది. అటు కేంద్రం నుంచి కూడా ఇన్ఫోసిస్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ వైఫల్యంపై విమర్శలూ పెరుగుతున్నాయి.
కేంద్రం డెడ్ లైన్
జీఎస్టీ, ఐటీ పోర్టళ్లలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం కూడా ఇన్ఫోసిస్ పై అసంతృప్తిగానే ఉంది. అయితే సాంకేతిక సమస్యలు సహజమే కావడంతో ఇన్ఫోసిస్ పై మరింత ఒత్తిడి పెంచలేకపోతోంది. దీంతో సమస్య పరిష్కారం కోసం కేంద్రం సెప్టెంబర్ 15 ను డెడ్ లైన్ గా విధించింది. ఈ మేరకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ పెద్దలకు డెడ్ లైన్ ఇచ్చేశారు. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే వేరే దారులు వెతుక్కునేందుకు సైతం కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఇన్పోసిస్ కూడా కీలకమైన జీఎస్టీ, ఐటీ పోర్టళ్లను దారిన పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఆరెస్సెస్ పాంచజన్యం సంచలన ఆరోపణలు
జీఎస్టీ, ఐటీ పోర్టళ్ల నిర్వహణలో విఫలమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పై కేంద్రం మెతకవైఖరి అవలంబిస్తోందని భావిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రంగంలోకి దిగింది. ఇన్ఫోసిస్ పై సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. ఏకంగా జాతి వ్యతిరేక శక్తులతో ఇన్ఫోసిస్ కుమ్మక్కు అయిందంటూ ఆరోపించింది. ఇన్ఫోసిస్ ఉద్ధేశపూర్వకంగానే భారత ఆర్ధిక వ్యవస్ధను అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడింది. దీంతో పాంచజన్య సంపాదకీయంలో చేసిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతర్జాతీయంగానూ ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
నక్సల్స్, లెఫ్టిస్టులతో కుమ్మక్కు
జీఎస్టీ, ఐటీ పోర్టళ్లను ఇన్ఫోసిస్ ఉద్దేశపూర్వకంగా సరిగా పనిచేయనీయకుండా చేస్తోందని పాంచజన్య ఆరోపించింది. అంతే కాదు ఇన్ఫోసిస్ జాతి వ్యతిరేకశక్తులైన నక్సల్స్, లెఫ్టిస్టులు, తుకడా, తుకడా గ్యాంగ్ లతో కుమ్మక్కు అయినట్లు విమర్శలు చేసింది. ఇప్పటివరకూ పాంచజన్య తన సంపాదకీయాల్లో వ్యక్తులతో పాటు సామాజిక కార్యకర్తలు, క్యాంపస్ రాజకీయాలు, కేంద్రంలో విపక్షాలను మాత్రమే టార్గెట్ చేసిన పాంచజన్య ఇప్పుడు ఏకంగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పై చేసిన ఆరోపణలు కార్పోరేట్ వర్గాల్ని నివ్వెరపరుస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఆరెస్సెస్ పత్రిక చేసిన ఆరోపణలతో ఇరుకునపడింది.
ముప్పేట దాడితో వెనక్కి తగ్గిన ఆరెస్సెస్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ను లక్ష్యంగా చేసుకుని ఆరెస్సెస్ పత్రిక పాంచజన్య చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఫోసిస్ వంటి పేరు ప్రఖ్యాతున్న సంస్ధను, అదీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంస్ధను టార్గెట్ చేయడమేంటని ఆరెస్సెస్ పై అంతా విరుచుకుపడుతున్నారు. దీంతో ఆరెస్సెస్ ఈ విమర్శలపై స్పందించింది.
ఆరెస్సెస్ తో పాంచజన్యకు ఎలాంటి సంబంధం లేదంటూ సంఘ్ ప్రచార వ్యవహారాలు చూస్తున్న సునీల్ అంబేకర్ క్లారిటీ ఇచ్చారు. పాంచజన్య ఆరెస్సెస్ మౌత్ పీస్ కాదని, అందులో చేసిన వ్యాఖ్యలతో సంఘ్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ దేశ పురోగతికి ఎంతో సేవ చేసిందని కొనియాడారు. తద్వారా ఈ విమర్శలకు కాస్తయినా తగ్గించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.